Share News

East Godavari District: సెల్‌ఫోన్‌ కోసం చంపేశారు

ABN , Publish Date - Jun 11 , 2025 | 05:05 AM

సెల్‌ఫోన్‌ కోసం బాల్య స్నేహితుడినే దారుణంగా హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. నార్త్‌జోన్‌ డీఎస్పీ వై.శ్రీకాంత్‌ కథనం మేరకు...

East Godavari District: సెల్‌ఫోన్‌ కోసం చంపేశారు

  • బాల్య స్నేహితుడి హత్య.. ఐదుగురు అరెస్టు

  • తూర్పుగోదావరి జిల్లా నిడిగట్లలో ఘటన

కోరుకొండ, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్‌ కోసం బాల్య స్నేహితుడినే దారుణంగా హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. నార్త్‌జోన్‌ డీఎస్పీ వై.శ్రీకాంత్‌ కథనం మేరకు... రాజమహేంద్రవరం ఆర్యాపురానికి చెందిన సింహాదుర్గాసాయి, శెట్టి వీరబాబు, ఆకుల గణేశ్‌, కర్రి శ్రీనివాస్‌ రెడ్డి, రేలంగి సాయి మణికంఠ(అలియాస్‌ తరుణ్‌), మృతుడు రాజమహేంద్రవరం రూరల్‌ మండలం వెంకటనగరానికి చెందిన కొవ్వాడ చిన్నబ్బులు(32) బాల్య స్నేహితులు. చిన్న చిన్న ఈవెంట్లు, కార్పెంటర్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీరంతా ఈ నెల 4న మధ్యాహ్నం రాజమహేంద్రవరం రివర్‌ బేలో పార్టీ చేసుకుని మద్యం తాగారు. పార్టీ అనంతరం వీరబాబుకు చెందిన సెల్‌ఫోన్‌ చిన్నబ్బులు చేతిలో ఉండగా కింద పడి గ్లాస్‌ పగిలిపోయింది. దీంతో వారి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. అదేరోజు సాయంత్రం ఆరుగురూ కలసి కోరుకొండ మండలం గాడాల శివారు నిడిగట్ల రోడ్డుకు చేరుకుని మరోసారి మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న వారి మధ్య సెల్‌ఫోన్‌ విషయమై మళ్లీ వాగ్వాదం మొదలైంది. చిన్నబ్బులుపై మిగిలిన ఐదుగురు పదునైన బ్లేడ్‌తో దాడి చేసి, బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని అక్కడే ఉన్న డ్రైన్‌లో పడేశారు. గాడాల వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన కోరుకొండ పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన బ్లేడ్‌తో పాటు వారి సెల్‌ఫోన్‌లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఐదుగురూ పాత నేరస్తులని డీఎస్పీ తెలిపారు.

Updated Date - Jun 11 , 2025 | 05:11 AM