Dharmavaram: సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Jun 17 , 2025 | 05:04 AM
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్కు (నంబర్ 12769) బ్రేక్ బైండింగ్ కావడంతో మంట లు చేలరేగాయి. ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ చైన్ లాగారు.

బ్రేక్ బైండింగ్తో చేలరేగిన మంటలు
ధర్మవరం రూరల్, జూన్ 16(ఆంధ్రజ్యోతి): తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే సెవెన్ హిల్స్ ఎక్స్ప్రెస్కు (నంబర్ 12769) బ్రేక్ బైండింగ్ కావడంతో మంట లు చేలరేగాయి. ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ చైన్ లాగారు. రైలు ఆగగానే దిగి దూరంగా పరుగులు తీశారు. సోమవారం రాత్రి సుమారు 8.40 గంటల సమయంలో శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు వేగంగా చిగిచెర్ల రైల్వేస్టేషన్ దాటగానే గార్డు ఉన్న బోగీ ముందుభాగం చక్రాల వద్ద బ్రేకు బైండింగ్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన గార్డు ట్రైన్ను అపేందుకు బీబీసీ బ్రేకు వేశారు. ప్రయాణికులు కూడా చైన్ లాగారు. రైలు ఆగగానే ప్రయాణికులు కిందకు దూకారు. చీకట్లో కంకర రాళ్లల్లో కేకలు వేస్తూ దూరంగా పరుగులు తీశారు. వెంటనే గార్డు మంటలను అగ్నిమాపక పరికరాలతో ఆర్పివేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో సుమారు అరగంట పాటు రైలు ఆగిపోయింది. పీలేరుకు చెందిన శ్రీదేవి రైలు దిగగానే ఆమె మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగుడు లాక్కుని పారిపోయారు. తోటి ప్రయాణికులు వెంబడించినా దొరకలేదు.