Share News

Vallabhaneni Vamsi: గుర్తులేదు.. తెలియదు

ABN , Publish Date - May 24 , 2025 | 05:11 AM

కృష్ణా జిల్లాలో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తున్నారు. వంశీ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో విచారణ కొనసాగుతోంది.

Vallabhaneni Vamsi: గుర్తులేదు.. తెలియదు

  • నకిలీ ఇళ్ల పట్టాల విచారణలో వంశీ సమాధానాలు

  • 20 ప్రశ్నలు సంధించిన పోలీసులు.. నేడూ విచారణ

విజయవాడ/కంకిపాడు, మే 23(ఆంధ్రజ్యోతి): ‘గుర్తులేదు.. తెలియదు.. మరిచిపోయాను’.. నకిలీ ఇళ్ల పట్టాల కేసు విచారణలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసుల విచారణలో చెప్పిన సమాధానాలు ఇవీ. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలో 2019 ఎన్నికల సమయంలో పంపిణీ చేసిన నకిలీ ఇళ్ల పట్టాల కేసులో శుక్రవారం పోలీసులు వంశీని కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడలోని జిల్లా జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని ముందుగా ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం అక్కడి నుంచి కంకిపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారించారు. తొలిరోజున అధికారులు మొత్తం 20 ప్రశ్నలు సంధించారు. వాటిలో కొన్నింటికి మాత్రమే వంశీ సమాధానం చెప్పారు. కొన్నింటికి సమాధానాలు చెప్పలేదు. ‘బాపులపాడు మండలంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారా? మీ అనుచర నాయకులు ఎవరు’ అని అధికారులు ప్రశ్నించగా.. గుర్తులేదు, మరచిపోయాను అని జవాబులు ఇచ్చినట్టు తెలిసింది. ఈ పట్టాలను గన్నవరంలో ఉన్న వంశీ కార్యాలయంలోనే ముద్రించారని వివిధ కేసుల విచారణలో ప్రాసిక్యూషన్‌ తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే అసలు నకిలీ పట్టాలంటే ఏమిటో తెలియనట్టుగా వంశీ వ్యవహరించారు. ఎక్కడ ముద్రించారో తనకు తెలియదని సమాధానం చెప్పారు. 2019లో ఏ పార్టీ తరఫున పోటీ చేశారని దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. ఆ ఏడాది ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆయన పోటీ చేసి గెలిచారు. ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా దాటవేశారు. కాగా, శనివారంతో వంశీ పోలీసు కస్టడీ ముగుస్తుంది.

Updated Date - May 24 , 2025 | 05:12 AM