పుష్కరాలు విజయవంతం చేస్తాం
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:55 AM
2027లో జరగబోయే గోదావరి పుష్కరాలను అన్ని వర్గాల సహకారంతో విజయవంతం చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.

రాజమహేంద్రవరం అర్బన్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలను అన్ని వర్గాల సహకారంతో విజయవంతం చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు.ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శనివారం రాజమహేంద్రవరంలోని ఛాంబర్ భవనంలో గోదావరి పుష్కరాలు, నగర సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రోన్ల సమీకృత సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి సమర్థవంతంగా వినియోగించుకుంటామన్నా రు. చిరువ్యాపారులకు నష్టం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సామూహిక వ్యాపారం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. గోదావరి నదీతీరంలో ఎక్కడ స్నానమాచరించినా పుణ్యమే అన్న విషయాన్ని భక్తుల్లో విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. గోదావరి పుష్కరాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని వైసీపీ కేంద్ర కమిటీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. గత పుష్కరాల్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. పుష్కరాల్లో భాగంగా చిరు వ్యాపారులకు నష్టం కలిగే చర్యలు తీసుకోకూడదని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. మూడు పాత మేజర్ డ్రైనేజీలను ఎస్టీపీ ప్లాంట్కు అనుసంధానించాలి అని సూచించారు. పవిత్ర గోదావరిలో స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఘాట్ల మార్గాలను సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకుడు కంటిపూడి సర్వారాయుడు సూచించారు. గోదావరి పుష్కరాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తాం అని ఆర్డీవో కృష్ణనాయక్ అన్నారు. 2027 పుష్కరాలను విజయవంతం చేస్తామని కమిషనర్ కేతన్గార్గ్ అన్నారు. చిరు వ్యాపారులకు నష్టం కలగకుండా మెయిన్రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తవ్వా రాజా అన్నారు. పుష్కరాల సమయంలో ముఖ్యంగా శానిటేషన్పై దృష్టిపెట్టాలి. చిరువ్యాపారులను ఇబ్బందిపెట్ట కూడదు అని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు, టి.అరుణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ సుబ్బరాజు, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ తిలక్కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, రుడా మాజీ చైర్పర్సన్ ఎం.షర్మిలారెడ్డి, కాంగ్రెస్ నాయకులు అసదుల్లా అహ్మద్, నందెపు శ్రీనివాస్, వై.శ్రీను, జామి సత్యనారాయణ, కాశి నవీన్కుమార్, నల్లం శ్రీను పాల్గొన్నారు.