ఫిర్యాదులు పెండింగ్లో ఉంచొద్దు
ABN , Publish Date - Apr 29 , 2025 | 01:04 AM
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు పెండింగ్లో ఉంచొద్దని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు.

రాజమహేంద్రవరం సిటీ/రూరల్, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు పెండింగ్లో ఉంచొద్దని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో జేసీ ఎస్.చిన్నరాముడుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహించవద్దన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన ఆడిట్ను ప్రతి శాఖ తప్పక చేయించాలన్నారు.కిందస్థాయి ఉద్యోగులు చూపిన పరిష్కారంపై ఫిర్యాదుదారులు సంతృప్తి చెందక పైస్థాయి అధికారి లాగిన్కి పంపితే జిల్లా స్ధాయి అధికారులే స్వయంగా పరిష్కరించాలన్నారు.కిందిస్థాయి ఉద్యోగులకు తిప్పి పంపవద్దన్నారు. తమ లాగిన్కు వచ్చిన ఫిర్యాదుపై తప్పక విచారణ చేసి సాక్ష్యాలు దగ్గర ఉంచు కోవాలని స్పష్టం చేశారు. విచారణ తేదీ సమయాన్ని సూచిస్తూ ఫిర్యాదుదారుడుకి నోటీసు పంపాలన్నారు.పీజీఆర్ఎస్లో సోమవారం 189 అర్జీలు స్వీకరించారు.తాళ్ళపూడి అన్నదేవరపేటలో పంచాయతీ స్థలంలో ఆక్రమణలు తొలగించాలని కొండె అనిల్ కుమార్, రాజమహేంద్రవరానికి చెందిన పి.లీలాకృష్ణ రాజమండ్రి నగరపాలక సంస్ధలో ఉద్యోగం నిమి త్తం, ధవళేశ్వరానికి చెందిన పిల్లి ఉమా ఇంటి స్థలం కోసం అర్జ్జీలు పెట్టుకున్నారు. పలువురు సమస్యలపై విన్నవించారు.