CPM MA Baby: పజలకు నష్టం కలగకుండా ఉగ్రవాదాన్ని అంతమొందించాలి
ABN , Publish Date - May 09 , 2025 | 05:21 AM
ఉగ్రవాదాన్ని అంతమొందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ప్రజలకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత ఎంఏ బేబి తెలిపారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టకుండా సామరస్యాన్ని ప్రోత్సహించాలని పార్టీ నేతలు కోరారు

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి
తిరుపతి, మే 8 (ఆంధ్రజ్యోతి): ‘పహల్గాం ఘటన సందర్భంగా ఒక వర్గాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టడం సరైంది కాదు. ఈ ఘటనలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అయితే ప్రతిదాడిలో ప్రజలకు నష్టం జరగకుండా ఉగ్రవాదాన్ని నాశనం చేయాలి. అందుకు మా మద్దతు ఉంటుంది. అదే విషయాన్ని ప్రధాని నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ సీపీఎం స్పష్టత ఇచ్చింది’ అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి అన్నారు. తిరుపతిలో మూడు రోజుల పాటు జరిగే సీపీఎం రాష్ట్ర సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశంలో ఎంఏ బేబి మాట్లాడుతూ దేశ ప్రజలందర్నీ కుల, మతాలకు అతీతంగా ఒకతాటిపై నిలబెట్టాల్సిన బాధ్యత ఎర్రజెండాపై ఉందన్నారు. పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ... ‘దేశంలో ప్రజాసంక్షేమం కరువైంది. లేబర్ కోడ్ వంటి ప్రజా వ్యతిరేక చట్టాలను తెచ్చి ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారు’ అని మండిపడ్డారు. ఉగ్రవాదానికి, ఫాసిజానికి వ్యతిరేకంగా అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల ను ఐక్యంచేసి పోరాడాలని రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.