Share News

Worker Protests: స్టీల్‌ప్లాంటులో సమ్మె సైరన్‌

ABN , Publish Date - May 20 , 2025 | 04:38 AM

విశాఖ స్టీల్ ప్లాంటులో కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మె ప్రారంభించారు. తొలగించిన కార్మికులను తిరిగి తీసుకోవాలని, స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Worker Protests: స్టీల్‌ప్లాంటులో సమ్మె సైరన్‌

  • నేటి నుంచి కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె

  • రెగ్యులర్‌ కార్మికులు ఒకరోజు.. విరమించాలన్న యాజమాన్యం

  • వెనక్కి తగ్గేది లేదన్న కార్మిక సంఘాలు

ఉక్కుటౌన్‌షిప్‌ (విశాఖపట్నం), మే 19(ఆంధ్రజ్యోతి): విశాఖపట్టణంలోని స్టీల్‌ప్లాంటు కాంట్రాక్టు కార్మికులు మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. ప్లాంటులో ఇటీవలి వరకూ 13 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉండేవారు. అందులో 1,750 మందిని అధికారికంగా, 1,000 మందిని అనధికారికంగా తొలగించారు. దీంతో తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని, ఇకపై ఎవరినీ తొలగించబోమంటూ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. మరోవైపు ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం ఉదయం 6గంటల వరకూ కార్మికులు (నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌) సమ్మె చేయనున్నారు. ప్లాంటును ప్రైవేటీకరించొద్దని, సకాలంలో వేతనాలు ఇవ్వాలని, ఆర్థిక ప్రయోజనాలను పునరుద్ధరించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నట్టు సంఘాల నాయకులు తెలిపారు. సమ్మె యోచన విరమించుకోవాలని యాజమాన్యం, ఆర్‌ఎల్‌సీ (రీజనల్‌ లేబర్‌ కమిషనర్‌) కోరినా నిరాకరించారు. స్పష్టమైన హామీ ఇస్తేనే విరమిస్తామని చెప్పారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో మంగళవారం నుంచి అధికారులు 2 షిప్టుల్లో విధులు నిర్వహించాలని యాజమాన్యం ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు భారీ బందోబస్తుకు పోలీసులు సిద్ధమయ్యారు. సౌత్‌ ఏసీపీ టి.త్రినాథ్‌ నేతృత్వంలో ఆరుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 208 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. స్టీల్‌ప్లాంటు పరిసర ప్రాంతాల్లో బీఎన్‌ఎ్‌సఎస్‌ 163 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు.

Updated Date - May 20 , 2025 | 04:38 AM