Class 5 Girl Ranjitha Case: రామచంద్రాపురం బాలిక కేసు.. వీడిన మిస్టరీ..
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:48 PM
రామచంద్రాపురానికి చెందిన బాలిక రంజిత అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. బాలిక కుటుంబంతో పరిచయం ఉన్న వ్యక్తే ఆమెను చంపేసినట్లు తేలింది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో హత్య చేశారని పోలీసులు తెలిపారు.
అంబేడ్కర్ కోనసీమ: జిల్లాలోని రామచంద్రపురంలో పదేళ్ల చిన్నారి సిర్రా రంజిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. చిన్నారి రంజితది హత్యగా పోలీసులు తేల్చారు. ఈ హత్య కేసుకు సంబంధించి అదే గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ పెయ్యల శ్రీనివాస్రావును అదుపులోకి తీసుకున్నారు. ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో శ్రీనివాసరావు బాలికను హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. శ్రీనివాసరావు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు.
అతడు చిన్నారి రంజిత కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతూ ఉన్నాడు. ఇంట్లో ఎలక్ట్రికల్ పనులు చేసేవాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో బాలిక ఇంట్లో దొంగతనం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్నపుడు తలుపు తీసుకుని లోపలికి ప్రవేశించాడు. ఇది చూసిన బాలిక ఇంట్లోకి ఎందుకు వచ్చావని నిలదీసింది. తల్లికి విషయాన్ని చెప్పేస్తుందనే భయంతో రంజితను హత్య చేశాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేశాడు. బాలిక మెడకు చున్నీ వేసి ప్యాన్కు వేలాడదీశాడు. కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు.
అనంతరం బాలిక ఆత్మహత్యకు పాల్పడింది అంటూ ప్రచారం మొదలెట్టాడు. సీసీటీవీ పుటేజ్ తీసుకుని ఓ మెసేజ్ను వాట్సాప్లో పెట్టి హడావుడి చేశాడు. ఈ మెసేజ్తోటే అతడి గుట్టురట్టయింది. పోలీసులకు అనుమానం వచ్చి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అసలు విషయం బయటపెట్టాడు.
ఇవి కూడా చదవండి
గ్రామంలో కలకలం సృష్టించిన భారీ కొండ చిలువ.. భయం గుప్పిట్లో జనం..
ఫామ్లో ధ్రువ్ జురెల్.. నితీశ్పై వేటు?