Share News

పిల్లలు ఎందరున్నా ‘తల్లికి వందనం’

ABN , Publish Date - Jun 14 , 2025 | 02:03 AM

ఒక బిడ్డ ఉంటే రూ.13 వేలు. ఇద్దరికైతే రూ.26 వేలు.. ముగ్గురున్న వారికి రూ.39 వేలు. ఇలా ‘తల్లికి వందనం’ పథకం కింద శుక్రవారం తల్లుల ఖాతాల్లో నగదు జమ అయింది. గత ప్రభుత్వం ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ‘అమ్మ ఒడి’ ఇస్తామని, చివరకు ఒకరికేనంటూ మోసం చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల నాటి హామీని నిలబెట్టుకోవడంతో విద్యార్థుల తల్లులకు వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే రూ.54.562 కోట్ల వరకు అదనపు లబ్ధి చేకూరింది.

పిల్లలు ఎందరున్నా ‘తల్లికి వందనం’
6- తమ ఖాతాల్లో నగదు జమయిందా అని సూళ్లూరుపేటలోని యూనియన్‌ బ్యాంకులో చెక్‌ చేసుకుంటున్న తల్లులు

వ్యత్యాసం: వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు 40,040 మంది పిల్లలకు అదనంగా ప్రయోజనం లభించింది. రూ.54.6520 కోట్లు అదనంగా జమయింది.

ప్రత్యేకత: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ‘తల్లికి వందనం’ కింద నగదు జమ చేసింది.

ఒక బిడ్డ ఉంటే రూ.13 వేలు. ఇద్దరికైతే రూ.26 వేలు.. ముగ్గురున్న వారికి రూ.39 వేలు. ఇలా ‘తల్లికి వందనం’ పథకం కింద శుక్రవారం తల్లుల ఖాతాల్లో నగదు జమ అయింది. గత ప్రభుత్వం ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ‘అమ్మ ఒడి’ ఇస్తామని, చివరకు ఒకరికేనంటూ మోసం చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల నాటి హామీని నిలబెట్టుకోవడంతో విద్యార్థుల తల్లులకు వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే రూ.54.562 కోట్ల వరకు అదనపు లబ్ధి చేకూరింది. అలాగే, 42 వేల మంది పిల్లలకు అధికంగా మేలు కలిగింది. అదే సమయంలో ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలున్న తల్లులకు రెట్టింపు నుంచీ నాలుగు రెట్ల వరకూ ప్రభుత్వం నుంచీ ఆర్థిక సాయం అందింది. స్కూలు, ఇంటర్‌ చదివే పిల్లలు ఎంత మంది ఉన్నా అందరికీ నగదు జమ కావడంతో ఆయా కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంటోంది. ముఖ్యంగా ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలుండి లబ్ధి అందుకున్న కుటుంబాల్లో సంబరం చెప్పనలవి కావడం లేదు. మొత్తమ్మీద జిల్లాలో తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందిన 1.40 లక్షల కుటుంబాల్లో సంబరం మిన్నంటింది. లబ్ధిదారుల ముఖాల్లో ఆనందోత్సాహాలు స్పష్టంగా కనిపించాయి. తల్లికి వందనం నిధులు బ్యాంకు ఖాతాలో జమ అయినట్టు మొబైల్‌ ఫోన్లకు వచ్చిన సంక్షిప్త సందేశాలు చూసుకుని మురిసిపోతూ కనిపించారు. కొంతమంది తమ ఖాతాల్లో నగదు జమ అయిందా లేదా అని చెక్‌ చేసుకుంటూ, మరికొంత మంది నేరుగా బ్యాంకుకు వెళుతూ హడావిడిగా కనిపించారు. ఖాతాల్లో నగదు జమయిన వారు ఆ విషయం ఇరుగుపొరుగు వారితో చెప్పుకుని సంబరపడ్డారు. శుక్రవారం రోజంతా దాదాపు ఎక్కడ చూసినా దీనిపైనే ఎక్కువగా చర్చ సాగింది.

మరమగ్గం కార్మికుల ఇంట సంబరం

పుత్తూరు పట్టణానికి చెందిన సుమతి, త్యాగరాజన్‌ దంపతులు మరమగ్గాల్లో నేత కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరికి పవిత్ర (6వ తరగతి), అనుష్క (5వ), వేద (మూడో తరగతి) పిల్లలు. తమ కూలి డబ్బులతో వీరు ముగ్గురు పిల్లలను చదివించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. మూడవ తరగతి చదువుతున్నారు. శుక్రవారం సుమతి బ్యాంకు ఖాతాలో రూ.39 వేలు జమయినట్టు మొబైల్‌ ఫోన్‌కు మెసేజ్‌ రావడంతో ఆ ఇంట్లో ఒక్కసారిగా సంబరం నెలకొంది. ‘గతంలో ఒక బిడ్డకే అమ్మ ఒడి కింద నగదు వచ్చింది. ఇప్పుడు ముగ్గురికీ ఒకేసారి బ్యాంకులో డబ్బు పడడం చాలా సంతోషాన్నిస్తోంది’ అని సుమతి చెప్పారు.

నిరుపేద కుటుంబానికి పెద్ద సాయం

తిరుపతి ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న భవానీ, అశోక్‌ దంపతులకు నలుగురు ఆడ పిల్లలు. భవానీ తోపుడు బండిపై కాస్మొటిక్స్‌ విక్రయిస్తూ, అశోక్‌ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. నలుగురు పిల్లల్లో ముగ్గురు.. కారుణ్య (టెన్త్‌), భార్గవి (తొమ్మిది), వైష్ణవి (4వ తరగతి) చదువుతున్నారు. ఈ ముగ్గురికీ కలిపి తల్లి భవాని బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం శుక్రవారం రూ.39 వేలు జమ చేసింది. దీంతో ఆ కుటుంబీకుల సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ‘గత ప్రభుత్వం ఒకరికే అమ్మఒడి నగదు వేయగా.. ఇప్పటి ప్రభుత్వం ముగ్గురు పిల్లలకు నగదు వేసింది. ఇలా మా పేద కుటుంబానికి ప్రభుత్వం పెద్ద సాయం చేసింది. సీఎం చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటాం. ఈ డబ్బును ఆడపిల్లల చదువులకే ఖర్చు పెడతాం’ అని భవాని అన్నారు.

బిడ్డల చదువుకు ఎంతో ఉపయోగం

బాలాయపల్లి మండలం ఎన్‌సీ కండ్రిగకు చెందిన అమరావతికి ముగ్గురు ఆడపిల్లలు. పెద్దమ్మాయి మమత సెవెన్త్‌, లక్ష్మి దీప్తి 4వ తరగతి, స్నేహ 2వ తరగతి చదువుతున్నారు. మునుపు వైసీపీ ప్రభుత్వంలో ఒకరికే అమ్మఒడి వేశారని, ఇపుడు సీఎం చంద్రబాబు ఎన్నికల హామీ ప్రకారం ముగ్గురికీ బ్యాంకులో రూ.13 వేలు చొప్పున నగదు జమ చేయడం చాలా సంతోషంగా ఉందని అమరావతి చెప్పారు. తన ముగ్గురు పిల్లలకు చేసిన ఆర్థిక సాయం బిడ్డల చదువుకు ఎంతో ఉపయోగపడుతుందని అమె అన్నారు. ఈ డబ్బును బిడ్డల చదువుకే ఖర్చు పెడతామని స్పష్టం చేశారు.

పేద కుటుంబానికి ఊహించని సాయం

ఈ ఫొటోలో కనిపిస్తున్నది డక్కిలికి చెందిన అంకుపల్లి మమత, ఆమె ముగ్గురు ఆడ బిడ్డలు. ఈ పిల్లలు ముగ్గురూ డక్కిలిలోనే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు. మమత భర్త కారు డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముగ్గురు పిల్లలకూ ఒకేసారి రూ.13 వేల లెక్కన తన బ్యాంకు ఖాతాలో రూ.39 వేలు జమ అయినట్టు ఫోన్‌కు మెసేజ్‌ వచ్చిందని మమత చెప్పారు. దాంతో పట్టలేని సంతోషం కలిగిందన్నారు. తమలాంటి పేద కుటుంబానికి చంద్రబాబు ప్రభుత్వం నుంచీ ఇది ఊహించని సాయమన్నారు.

- తిరుపతి, ఆంధ్రజ్యోతి

Updated Date - Jun 14 , 2025 | 02:03 AM