గంగమ్మకే శఠగోపం!
ABN , Publish Date - Jun 13 , 2025 | 01:42 AM
తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో భజంత్రీలుగా పనిచేస్తున్న ఐదుగురు సిబ్బందిని వైసీపీ అధికారంలోని కొందరి చర్య వలన బలిపశువులగా మారారు. దేవదాయశాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయంటూ పదోన్నతి కల్పించేసి వారి కళ్లల్లో నింపిన ఆనందాన్ని మూన్నాళ్ల ముచ్చటగా మార్చారు.

ఫేక్ ఉత్తర్వులతో ప్రమోషన్లు
వైసీపీ హయాంలో జరిగిన నకిలీ కథ
ఐదుగురిపై సస్పెన్షన్ వేటు, క్రిమినల్ కేసు
బలిపశువులుగా భజంత్రీలు
పరారీలో కంప్యూటర్ ఆపరేటర్
(తిరుపతి- ఆంధ్రజ్యోతి)
తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో భజంత్రీలుగా పనిచేస్తున్న ఐదుగురు సిబ్బందిని వైసీపీ అధికారంలోని కొందరి చర్య వలన బలిపశువులగా మారారు. దేవదాయశాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయంటూ పదోన్నతి కల్పించేసి వారి కళ్లల్లో నింపిన ఆనందాన్ని మూన్నాళ్ల ముచ్చటగా మార్చారు. కమిషనర్ పేరిట వచ్చిన పదోన్నతి ఉత్తర్వులు ఫేక్ అని తేలడంతో ఐదుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. క్రిమినల్ కేసూ నమోదైంది.
ఉమ్మడి ఏపీలో దేవదాయ, ధర్మదాయ శాఖ పరిధిలోని ప్రధాన ఆలయాల్లో భజంత్రీలు (వాయిద్యకారులను) నియమించాలని 2008లో అప్పటి ప్రభుత్వం భావించింది. ఈక్రమంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి 9 మందిని భజంత్రీలు పేరిట నియమించారు. కొంతకాలానికి టైం స్కేల్ ఇచ్చారు. 15 ఏళ్లకుపైగా పనిచేస్తున్నామని, తమను గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1 సిబ్బందిగా పదోన్నతి కల్పించాలని పలుసార్లు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇస్తూ వచ్చారు. ఈక్రమంలో కొందరు హామీలు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో భజంత్రీలు జి.శివకుమార్ (నాదస్వరం), పి.వెంకటసుబ్బయ్య (డోలు), ఆర్.జయరాం (డోలు) 2022 డిసెంబరు 30న గ్రేడ్1గా పదోన్నతి పొందినట్టు కమిషనరు కార్యాలయం ఉత్తర్వు గంగమ్మ ఆలయ కార్యాలయంలో ప్రత్యక్షమైంది. అప్పుడు ఈవోగా ఉన్న మునికృష్ణయ్య 2023 జనవరి 1న గ్రేడ్-2 కేడర్ కింద విధులు నిర్వహిస్తున్న వీరికి గ్రేడ్-1గా పదోన్నతి ఇచ్చేశారు. అనారోగ్య కారణాలతో 2023 అక్టోబరు 1న ఈవో మునికృష్ణయ్య విధుల్లో ఉండగానే మృతిచెందారు. తమతో పాటు పనిచేసిన ముగ్గురికి పదోన్నతి రావడంతో మరికొంతమంది ప్రయత్నించారు. మునికృష్ణయ్య మృతి తర్వాత ఈవోగా వచ్చిన మమత టేబుల్ పై దేవదాయ శాఖ కమిషనర్ నుంచి వచ్చినట్టు మరో ఉత్తర్వు కనిపించింది. భజంత్రీగా ఉన్న పి.అయ్యప్పను రికార్డు అసిస్టెంట్గా, పి.రెడ్డెమ్మ (నాదస్వరం)ను గ్రేడ్-1గా పదోన్నతి ఇస్తున్నట్టు సదరు ఉత్తర్వులో ఉంది. అయితే ఈవో ఉత్తరు కాపీని ముందు, వెనుక చూడకుండా ముందు ఈవో ఇచ్చారు కదా అని వీరికీ పదోన్నతి ఇచ్చేశారు.
ఫేక్ అని బయట పడిందిలా..
‘భజంత్రీని రికార్డు అసిస్టెంట్గా ఎలా ఇస్తారని? దీనిపై విచారించి చర్యలు తీసుకోకపోతే ఆలయం వద్ద ఆందోళన చేస్తాం’ అనే సారాంశంతో ఈ ఏడాది ఏప్రిల్లో దేవదాయశాఖ ఆర్జేసీకి ఎవరో వాట్స్పలో మెసేజీ పంపారు. తనకు వచ్చిన మెసేజీని ఏప్రిల్ 23న గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్కు పంపి.. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్జేసీ ఆదేశించారు. దీనిపై ఈవో విచారణ చేపట్టారు. కార్యాలయంలో ఉన్న ఉత్తర్వులు.. కమిషనర్ కార్యాలయంలో లేకపోవడం, కేవలం వాట్సప్, మెయిల్లో ఉత్తర్వులు వచ్చినట్టు ఉండడం, వాటి ఆధారంగా అప్పటి ఆలయ ఈవోలు మునికృష్ణయ్య, మమత వీరికి పదోన్నతలు ఇచ్చినట్టు నిర్ధారణ అయింది. ఆ మేరకు ఆయన ఉన్నతాధికారులకు నివేదక పంపారు. దీంతో ఐదుగురు భజంత్రీలను సస్పెండ్ చేసి పోలీసు కేసు పెట్టాలని అధికారులు ఆదేశించారు. కంప్యూటర్ ఆపరేటర్ పి.సి.నవీన్ కృష్ణ కుమార్ మెయిల్లో ఉత్తర్వులు వచ్చాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదివెలుగులోకి వచ్చిన వెంటనే ఆపరేటర్ నవీన్ పరారీలో ఉన్నాడు. అతడిని విచారిస్తే తప్ప అసలు విషయాలు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. కాగా నకిలీ ఉత్తర్వుల వెనుక తమకెలాంటి ప్రమేయం లేదని భజంత్రీలు వాపోతున్నారు. పదోన్నతలు వచ్చాయని అధికారులు చెబితేనే తమకు తెలిసిందని విలపిస్తున్నారు.