కల్యాణి డ్యామ్ వైపు మళ్లీ ఏనుగులు
ABN , Publish Date - Aug 01 , 2025 | 02:09 AM
చంద్రగిరి మండలంలోని శేషాచల అటవీ ప్రాంత సరిహద్దుల్లో మూడు రోజులుగా గజరాజులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున ఎ.రంగంపేట పంచాయతీ పరిధిలోని రాగిమాకులకుంట సమీపంలో గోవర్ధన్ పొలంలో చొరబడి వరి పంటను ధ్వంసం చేశాయి.

రాగిమాకులకుంట సమీపాన వరి పంట ధ్వంసం
చంద్రగిరి, జూలై 31(ఆంధ్రజ్యోతి): చంద్రగిరి మండలంలోని శేషాచల అటవీ ప్రాంత సరిహద్దుల్లో మూడు రోజులుగా గజరాజులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున ఎ.రంగంపేట పంచాయతీ పరిధిలోని రాగిమాకులకుంట సమీపంలో గోవర్ధన్ పొలంలో చొరబడి వరి పంటను ధ్వంసం చేశాయి. అనంతరం కల్యాణి డ్యామ్ వైపు వెళ్లాయి. దీంతో ఆప్రాంత ప్రజలను అటవీ అధికారులు అప్రమత్తం చేశారు. రాగిమాకులకుంట, దుర్గం ఎస్టీ కాలనీల వైపు ఏనుగుల గుంపు రాకుండా అటవీ సిబ్బంది బాణసంచా కాల్చారు. డప్పులు వాయించారు. శ్రీనివాసమంగాపురం ఎస్టీ కాలనీ, నరసింగాపురం పంచాయతీలోని సత్యసాయి ఎస్టీ కాలనీ, రామిరెడ్డిపల్లె పంచాయతీలోని వైకుంఠపురం ఎస్టీ కాలనీ, ఎ.రంగంపేట పంచాయతీలోని ఎంబీయూ విద్యాసంస్థ ప్రాంతం, రాగిమాకుల ఎస్టీ కాలనీ, దుర్గం ఎస్టీకాలనీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగపట్ల రేంజ్ ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. రాత్రి వేళ్ళల్లో రైతులు పొలాలకు వెళ్ళకూడదని సూచించారు. ఏనుగుల ఉనికి గురించి తెలిస్తే వెంటనే వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం అందించాలని కోరారు.