Share News

అతివేగానికి ఎనిమిదిమంది బలి

ABN , Publish Date - Jun 14 , 2025 | 01:59 AM

రెండు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది నిండుప్రాణాలు బలయ్యాయి.17మంది గాయాలపాలై ఆస్పత్రుల పాలయ్యారు.ఈ రెండు ప్రమాదాలకూ అతివేగమే కారణం కావడం విశేషం.ఒక ప్రమాదంలో లారీని ఓవర్‌ టేక్‌ చేయబోయిన ఆర్టీసీ బస్సు తుక్కుతుక్కు కాగా మరో ప్రమాదంలో సర్వీసు రోడ్డుపై వెళుతున్న ఇద్దరిని ఢీకొట్టి మృత్యుఒడికి చేర్చిన కారు ధ్వంసమైంది. ప్రాణాలు కోల్పోయారు. Eight people were killed in two road accidents. 17 people were injured and hospitalized. Speeding was the cause of both accidents.

అతివేగానికి ఎనిమిదిమంది బలి
ప్రమాదంలో దెబ్బతిన్న బస్సు

వెదురుకుప్పం, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి):కర్ణాటక రాష్ట్రం బెంగళూరు శివారుప్రాంతమైన హొస్కోటలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.14మంది గాయాలపాలయ్యారు. తిరుపతి నుంచి బెంగళూరుకు చిత్తూరు టూ డిపో బస్సు శుక్రవారం రాత్రి 31మంది ప్రయాణికులతో బయల్దేరింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో హొస్కొటె సమీపంలో గొట్టిపుర గేట్‌ వద్ద ముందు వెళ్తున్న లారీని ఓవర్‌ టేక్‌ చేయబోయి అదుపుతప్పి ఢీకొట్టింది.ఆ వేగం ధాటికి బస్సు కుడివైపు సగందాకా తుక్కుతుక్కు అయిపోయింది.దీంతో డ్రైవర్‌ వెనుకవైపు కూర్చున్నవారిలో ఐదుగురు మృతిచెందారు.తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం తిమ్మరాజుపల్లెకు చెందిన హరిబాబు కుమార్తె ప్రణతి(5), చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగుకు చెందిన కె.జనార్దన రెడ్ది కుమారుడు 40రోజుల వయసున్న హేత్విక్‌, కె.కేశవులురెడ్డి(44), ఎస్‌ఆర్‌పురం మండలం పుల్లూరుకు చెందిన తులసి అలియాస్‌ తనూజ(22), బెంగుళూరులోని జేపీనగర్‌లో స్థిరపడ్డ గంగాధర నెల్లూరు మండలం మారేడుపల్లెకు చెందిన శారద(43) మృతి చెందిన వారిలో వున్నారు.తీవ్రంగా గాయపడ్డ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ వీఎల్‌కే కుమార్‌ను సిలికాన్‌ సిటీ ఆస్పత్రిలో చికిత్స చేయించాక మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. అలాగే బెంగుళూరులోని జేపీ నగర్‌కు చెందిన ధనలక్ష్మి(37),వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగుకు చెందిన కె.గిరిజ(22) సిలికాన్‌ సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.స్వల్పగాయాలతో బెంగళూరులోని జేపీనగర్‌కు చెందిన సిద్ధయ్య(42), వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగుకు చెందిన కె.పాపమ్మ(63), జశ్విన్‌(3), జనార్దన రెడ్డి(32),సోమేంద్రపురానికి చెందిన చతుర్య(19), నచ్చుకూరుకు చెందిన రోహిత్‌రెడ్డి(11), రామచంద్రాపురం మండలం తిమ్మరాజుపల్లెకు చెందిన హరిబాబు కుమార్తెలు మాధురి(9), కాత్యాయని(11) గాయపడిన వారిలో ఉన్నారు.

గంగమ్మ ఉత్సవాలకని వచ్చి.....

రామచంద్రాపురం, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): ప్రమాద మృతుల్లో ఒకరైన ప్రణతి తండ్రి ఒంటెల హరిబాబు స్వస్థలం రామచంద్రాపురం మండలం తిమ్మరాజుపల్లె. ఆర్మీలో ట్రైనింగ్‌ అధికారిగా బెంగళూరులో పనిచేస్తున్నాడు.స్వగ్రామంలో గంగమ్మకు జరిగే కుంభాల ఉత్సవాలకు కుటుంబంతో వచ్చిన హరిబాబు తిరిగి వెళుతుండగా జరిగిన ప్రమాదంలో చిన్న కుమార్తె ప్రణతి(5)ని కోల్పోయాడు.పెద్దకుమార్తె కాత్యాయని ఎడమకాలు విరిగిపోగా, రెండవ కుమార్తె మాధురి కుడిచెయ్యికి తీవ్రగాయమైంది.

ఆళ్లమడుగులో విషాదం

బస్సు ప్రమాదంలో వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగుకు చెందిన ఓ నలబై రోజుల చిన్నారి సహా ఓ దినసరి కూలీ చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది కూలి పనులతో జీవనం సాగించే ఆళ్లమడుగుకు చెందిన కామసానికి కేశవులురెడ్డి(44) అతని తమ్ముడు కె.జనార్దన రెడ్డి(32), తమ్ముడి భార్య గిరిజ(22), తమ్ముడి కుమారులైన నలబై రోజుల వయసున్న హేత్విక్‌, జశ్విన్‌రెడ్డి(4), అమ్మ పాపమ్మ(62) గురువారం రాత్రి బెంగుళూరులోని పుట్టానహళ్లికి బయలుదేరారు.హొస్కోట దగ్గర ప్రమాదంలో కేశవులురెడ్డి(46), హేత్విక్‌ మృత్యుఒడిలోకి చేరుకున్నారు. జనార్దన రెడ్డి, గిరిజ, జశ్విన్‌రెడ్డి, పాపమ్మ గాయపడ్డారు. వీరిలో గిరిజ పరిస్థితి విషమంగా ఉంది.

ఏకైక కుమార్తె మృతితో దిగ్ర్భాంతి

ఎస్‌ఆర్‌పురం మండలం పుల్లూరుకు చెందిన మునిలక్ష్మి, రమేష్‌ దంపతుల ఏకైక కుమార్తె తనూజ అలియాస్‌ జి.తులసి(22) బీటెక్‌ పూర్తి చేసుకుంది.బెంగుళూరులో కంప్యూటర్‌ కోర్సు చేసేందుకు తన పినతండ్రి జి.సిద్ధయ్య(42)తో బస్సులో వెళుతూ ప్రమాదంలో మృతిచెందింది.తమకు దాపుగా ఉంటుందనుకున్న కుమార్తె రోడ్డు ప్రమాదం బారినపడి చనిపోవడాన్ని ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.శుక్రవారం సాయంత్రం ఆమె మృత దేహం స్వగ్రామానికి చేరుకుంది.

థామస్‌ టీమ్‌ సేవలు

ప్రమాద సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ విప్‌, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం థామస్‌ సూచనలతో ఆయన అనుచరులు హరీ్‌షయాదవ్‌, బోడిరెడ్డి సుధాకరరెడ్డి, దామోదరరెడ్డి తదితరులు బెంగళూరుకు చేరుకుని క్షతగాత్రులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో థామస్‌ వీడియో కాల్‌లో మాట్లాడి దైర్యం చెప్పారు.బస్సు ప్రమాదం తనను కలచివేసిందని థామస్‌ తెలిపారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.50లక్షల చొప్పున అందించాలని, గాయపడిన వారికి రూ.10లక్షలు తక్షణ సాయం అందించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్‌ చేశారు.

పినతండ్రి కర్మక్రియలకొచ్చి...

గంగాధరనెల్లూరు (ఆంధ్రజ్యోతి): బస్సు ప్రమాదంలో మృతి చెందిన శారద (42) కుటుంబం బెంగళూరులో స్థిరపడ్డా ఆమె స్వస్థలం గంగాధరనెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె పంచాయతీ మారేడుపల్లె. భర్త విశ్వనాధరెడ్డి, కుమారుడు తేజు, కుమార్తె తేజస్వినిలతో బెంగుళూరు సిటీలో శారద ఉంటోంది. శారద ఇండ్ల పనికి వెళుతుండగా, విశ్వనాధరెడ్డి తాపీమేస్త్రి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.మారేడుపల్లెలో పినతండ్రి కర్మక్రియలకు హాజరయ్యేందుకు శారద గురువారం ఉదయం స్వగ్రామానికి వచ్చింది. అదే రోజు రాత్రి బస్సులో బెంగళూరు వెళుతుండగా ప్రమాదానికి గురై మృతి చెందింది. ఇదే మండలంలోని తూగుండ్రం గ్రామానికి చెందిన టీడీపీ నేత మురగారెడ్డి కుమారుడు లక్ష్మీకరుణ కుమార్‌ రెడ్డి అలియాస్‌ వి.ఎల్‌.కె.కుమార్‌ రెడ్డి అలియాస్‌ డ్రైవర్‌ కర్ణ చిత్తూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. గురువారం రాత్రి ఆయన నడుపుతున్న బస్సే హోస్కోట వద్ద ప్రమాదానికి గురైంది.తీవ్రగాయాల పాలైన ఆయన్ను శుక్రవారం అతని బంధువులు హోస్కోట ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యంకోసం బెంగుళూరు సిటీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Jun 14 , 2025 | 01:59 AM