Share News

మామిడి మద్దతు ధర అమలులో ఆటంకాలు

ABN , Publish Date - Jun 13 , 2025 | 01:49 AM

తోతాపురి మామిడి కాయలకు మద్దతు ధర అమలులో అధికార యంత్రాంగానికి గుజ్జు పరిశ్రమల నుంచి సహకారం అందడం లేదు. మామిడి రైతులను ఆదుకునేందుకు తోతాపురికి మద్దతు ధర రూ.12 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అందులో రూ.4 సబ్సిడీపై ఇస్తామని చెప్పడంతో రైతులు ఆనందపడ్డారు.

మామిడి మద్దతు ధర అమలులో ఆటంకాలు

రూ.8 ఇచ్చేందుకు ముందుకు రాని ఫ్యాక్టరీలు

పరిధికి మించి కల్పించుకోలేకపోతున్న అధికారులు

చిత్తూరు సెంట్రల్‌, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి):తోతాపురి మామిడి కాయలకు మద్దతు ధర అమలులో అధికార యంత్రాంగానికి గుజ్జు పరిశ్రమల నుంచి సహకారం అందడం లేదు. మామిడి రైతులను ఆదుకునేందుకు తోతాపురికి మద్దతు ధర రూ.12 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అందులో రూ.4 సబ్సిడీపై ఇస్తామని చెప్పడంతో రైతులు ఆనందపడ్డారు.అయితే తమిళనాడు, కర్ణాటకల నుంచి కాయలు రూ.4కే ధొరుకుతుండడంతో గుజ్జు పరిశ్రమలు అటు మొగ్గు చూపాయి. దీంతో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ సమావేశాలు నిర్వహించి సహకరించమని కోరినా నష్టానికి వ్యాపారాలు చేయలేమని గుజ్జు ఫ్యాక్టరీ యాజమాన్యాలు చేతులెత్తేశాయి.ప్రభుత్వం ఇచ్చే రూ.4 సబ్సిడీ కోసం తాము రూ.4 నష్టపోలేమని చెబుతున్నాయి. చివరకు కిలోకు రూ.5మంచి చెల్లించలేమని స్పష్టం చేశాయి. అధికారులు వత్తిడి తెచ్చి పరిశ్రమల్లో నిర్ణయించిన ధరకు కాయలు కొనాలంటూ ఆదేశాలు జారీ చేసినా పలు గుజ్జు పరిశ్రమలు ఒప్పుకోవడం లేదు.ఓ పరిశ్రమ యాజమాన్యమైతే మద్దతు ధర అమలు చేయించేందుకు తమ ఫ్యాక్టరీ ఆవరణలోకి ప్రభుత్వ అధికారులు రావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.ఫ్యాక్టరీలో దొంగతనం, ఆస్తినష్టం జరిగితే అందుకు ప్రభుత్వ సిబ్బందిని బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. గతేడాది మార్కెట్‌ లేకపోవడంతో గుజ్జు పరిశ్రమల్లో దాదాపు 2.50 లక్షల టన్నుల పల్ప్‌ నిలిచిపోయింది.సగం ధరకు 75 వేల టన్నులు విక్రయించగా 50 వేల టన్నుల పల్ప్‌ పాడైపోయింది.మిగిలిన మొత్తం 1.25 లక్షల పల్ప్‌ నిల్వలు ఇంకా ఫ్యాక్టరీల్లోనే ఉండడంతో పెద్దమొత్తంలో కాయల్ని కొనలేకపోతున్నామని గుజ్జు పరిశ్రమదారులు చెబుతుండడంతో అధికారులు కూడా ఒక దశ దాటి గుజ్జు పరిశ్రమలపై వత్తిడి తేలేక పోతున్నారు.గుజ్జు పరిశ్రమల వద్దకు వచ్చిన కాయల్లో నాణ్యత లేకపోయినా కొనిపించేలా అధికారులపై కొందరు రైతులు వత్తిడి తేవడం, నాణ్యత లేని కాయలకు అంత ధర ఇవ్వలేమని గుజ్జు పరిశ్రమలు చెప్పడం...క్షేత్రస్థాయిలో అనేక సమస్యలతో అధికార యంత్రాంగం సైతం నీరసించిపోయింది.

Updated Date - Jun 13 , 2025 | 01:49 AM