ఎస్జీటీల బదిలీల్లో గందరగోళం
ABN , Publish Date - Jun 13 , 2025 | 01:47 AM
సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీ కౌన్సెలింగ్ రోజుకో మలుపు తిరుగుతోంది.స్పౌజ్ కేసుల్లో జీవో ప్రకారం బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు, టీచర్లు పట్టుపడుతుండగా నిబంధనల ప్రకారమే చేస్తున్నామంటూ విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

జీవో ప్రకారం బదిలీలు నిర్వహించాలన్న యూనియన్లు
నిబంధనలకు లోబడే నిర్వహిస్తున్నామన్న అధికారులు
చిత్తూరు సెంట్రల్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీ కౌన్సెలింగ్ రోజుకో మలుపు తిరుగుతోంది.స్పౌజ్ కేసుల్లో జీవో ప్రకారం బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు, టీచర్లు పట్టుపడుతుండగా నిబంధనల ప్రకారమే చేస్తున్నామంటూ విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. చిత్తూరు షర్మన్ మెమోరియల్ స్కూల్లో మంగళవారం డీఈవో వరలక్ష్మి ఆధ్వర్యంలో మొదలైన ఎస్జీటీల మ్యానువల్ కౌన్సెలింగ్లో దాదాపు 800మందికి పైగా బదిలీ అయ్యారు.వరుస సంఖ్య 703లోని ఎస్జీటీతో స్పౌజ్ పాయింట్స్ వినియోగంపై మొదలైన సమస్య పెద్దదైంది.గురువారం ఉదయం 11 గంటలకు 501 వరుస సంఖ్య నుంచి సాఫీగా మొదలైన బదిలీ కౌన్సెలింగ్ సాయంత్రానికి వేడెక్కింది.జీవో ప్రకారం కౌన్సెలింగ్ చేపట్టాలి, కంపల్సరీ స్పౌజ్ అభ్యర్థులకు న్యాయం చేయాలి అంటూ 5 గంటలకు ఎస్జీటీలు నిరసనకు దిగారు.భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో 8 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుంటే ఖచ్చితమైన బదిలీ కిందికి వస్తారు. పాయింట్ల ఆధారంగా మొదట వచ్చే భర్త/భార్య జిల్లాలో ఏ ప్రాంతానికైనా బదిలీ కోరుకునే వెసులుబాటు ఉంది. తదుపరి వచ్చే టీచర్ భర్త/భార్య కోరుకున్న సమీప ప్రాంతానికి వెళ్లాల్సి ఉందని అధికారులు చెప్పారు.అయితే ఇద్దరూ తలో వైపు వెళతామంటూ పట్టుబడుతుండడంతోనే దుమారం రేగుతోందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఎస్జీటీల ఆందోళన సమాచారంతో డీఆర్వో మోహన్ కుమార్ కౌన్సెలింగ్ సెంటర్కు చేరుకుని డీఈవో వరలక్ష్మితో పాటు ఆర్జేడీ శామ్యూల్తో ఫోన్లో చర్చించారు. బదిలీ జీవోలో వెసులుబాటు ఉన్నంత వరకు న్యాయం చేస్తామని ఎస్జీటీలకు హామీ ఇచ్చాక 6.30 గంటలకు కౌన్సెలింగ్ మళ్లీ మొదలై రాత్రి 12 గంటల వరకు కొనసాగింది.
నేటి బదిలీ షెడ్యూల్ : శుక్రవారం ఉదయం 8.30 గంటలకు సీరియల్ నంబరు 1001 నుంచి మొదలై 1500 వరకు సాగుతుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు సీరియల్ నంబరు 1501తో మొదలుపెట్టి 2000 వరకు బదిలీలు నిర్వహిస్తామని డీఈవో వరలక్ష్మి తెలిపారు.