Chief Minister Office: డ్రాగన్ ప్రకంపనలపై సీఎంవో ఆరా
ABN , Publish Date - Jun 10 , 2025 | 04:30 AM
గుంటూరు మిర్చి మార్కెట్లో డ్రాగన్ ప్రకంపనలపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. గుంటూరు మిర్చి ఎగుమతిదారులు ఎగుమతి చేసిన చేసిన కంటైనర్లలో 60 తిరస్కరణకు గురైన విషయంపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై స్పందించింది.

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందించిన అధికారులు
మిర్చి ఎగుమతులపై సమగ్ర నివేదికకు ఆదేశం
చైనా కస్టమ్స్ రిపోర్టును తెప్పించి పరిశీలించిన మార్కెటింగ్ శాఖ
60 కంటైనర్లను తిరస్కరించినా.. నగదు జమ అయినట్లు వెల్లడి
అయితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే ఆందోళన
గుంటూరు, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): గుంటూరు మిర్చి మార్కెట్లో డ్రాగన్ ప్రకంపనలపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. గుంటూరు మిర్చి ఎగుమతిదారులు ఎగుమతి చేసిన చేసిన కంటైనర్లలో 60 తిరస్కరణకు గురైన విషయంపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై స్పందించింది. ఈ వ్యవహారంలో మార్కెటింగ్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల నుంచి సమగ్ర నివేదిక కోరింది. దాంతో ఆయా శాఖల అధికారులు మిర్చి ఎగుమతి, దిగుమతిదారులు, గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులకు ఫోన్లు చేసి వివరాలు తీసుకొన్నారు. కంటైనర్లను నిలిపేస్తూ చైనాలోని క్విండావో పోర్టు కస్టమ్స్ అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్, పురుగుమందు అవశేషాలున్న ల్యాబ్ రిపోర్టులు, విజయవాడ కస్టమ్స్ శాఖకు ఇక్కడి ఎగుమతిదారులు చేసుకొన్న విజ్ఞప్తి పత్రాలను మార్కెటింగ్ కమిషనర్ కార్యాలయ అధికారులు సేకరించి సీఎంవోకు నివేదిక ఇచ్చారు. కాగా, కంటైనర్లు తిరస్కారానికి గురైన విషయం తెలియడంతో మిర్చి మార్కెట్లో కలకలం రేకెత్తించింది. ఇది ఇరుదేశాల మధ్యన ఎలాంటి ట్రేడ్ వార్కు దారి తీస్తుందోనని వ్యాపారవర్గాల్లో ఆందోళన నెలకొంది.
చైనా, మిగతా దేశాల ఎగుమతి విధానంలో తేడాలు!
అంతర్జాతీయంగా మిర్చి ఎగుమతులకు గుంటూరు పెట్టింది పేరు. ఇక్కడ పండే తేజ వెరైటీ మిర్చి ఘాటే ఇందుకు కారణం. దాంతో ఆయా దేశాల ప్రజలు ఆహార పదార్థాల తయారీలో ఈ రకాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. యూరప్, అమెరికా ఖండాల్లోని దేశాలు ఏ ఆహారోత్పత్తినైనా దిగుమతి చేసుకోవడానికి మినిమిం రెసిడ్యూవల్ లెవల్(ఎంఆర్ఎల్)ని చూస్తాయి. పురుగుమందుల అవశేషాలు మోతాదుకు మించి ఉండరాదు. ఈ దేశాలకు ఇక్కడి ఎగుమతిదారులు ముందుగానే వాళ్ల సూచికల మేరకు మిర్చి నాణ్యత ఉందో, లేదో స్పైసెస్ బోర్డు ల్యాబ్లో టెస్టింగ్ చేయిస్తారు. అంతా సవ్యంగా ఉంటేనే సరుకు ఎక్స్పోర్టు చేస్తారు. చైనా విషయంలో అలా కాదు. ఎక్స్పోర్టు చేసే ముందు స్పైసెస్ బోర్డుకు శాంపిల్ పంపిస్తారు. ఆ సంస్థ శాంపిల్ డ్రా చేసినట్లు సర్టిఫికెట్ ఇస్తుంది. టెస్టు రిపోర్టుతో సంబంధం లేకుండా చెన్నై పోర్టు నుంచి చైనాకు ఎక్స్పోర్టు చేస్తారు. ఆ దేశంలో ప్రధానంగా షికావో, క్విండావో పోర్టులకే కంటైనర్లలో మిర్చి షిప్ల ద్వారా ఎగుమతి అవుతుంటుంది. ఈ రెండు పోర్టుల్లో నిబంధనలు వేరుగా ఉన్నాయి. ఎప్పుడైతే పోర్టుకు కంటైనర్లు చేరాయో ఆ సమాచారం ఇక్కడి ఎగుమతిదారులకు ఆన్లైన్లో తెలిసిపోతుంది. దాంతో వీళ్లు మెయిల్లో గూడ్స్ సరెండర్ మెసేజ్ పంపుతారు. దాని ఆధారంగా అక్కడి దిగుమతిదారుకు పోర్టు అధికారులు కంటైనర్ను స్వాధీనపరుస్తారు. ఆ వెంటనే దిగుమతిదారు భారత్లోని ఎగుమతిదారులకు మొత్తం నగదును ఆన్లైన్లో బదిలీ చేస్తారు. తదుపరి కంటైనర్లను కస్టమ్స్ అధికారులు పోర్టులో తనిఖీ చేయరు. వేర్హౌ్సకు తీసుకెళ్లి క్వారంటైన్ చేయాలని చెప్పి రెండు, మూడు రోజుల వ్యవధిలో యాదృచ్ఛికంగా కొన్ని కంటైనర్లలో శాంపిల్స్ తీస్తారు. వాటిని టెస్టులకు పంపుతారు.
అయితే అక్కడి ఎగుమతిదారులు కస్టమ్స్ అధికారులను మేనేజ్ చేసుకొని గూడ్స్ పాస్ సర్టిఫికెట్ తీసుకొని మిర్చిని విక్రయించుకొంటుంటారు. అయితే, భారత్, చైనా మధ్యన దిగుమతుల విషయంలో పరస్పరం సుంకాలు విధించినప్పుడు, ఏవైనా సరుకులు తిరస్కరించినప్పుడు ఇలా ఇబ్బందులు పెడుతుంటారని ఇక్కడి ఎగుమతిదారులు చెబుతున్నారు. గతంలో ఉత్తర భారతదేశం నుంచి జీలకర్ర కంటైనర్లను ఇలానే అక్కడి కస్టమ్స్ తిరస్కరించిందని గుంటూరు మిర్చి ఎక్స్పోర్టర్లు తెలిపారు. ఇప్పుడు తిరస్కరించిన 60 కంటైనర్లకు సంబంధించి మిర్చి ఎగుమతిదారులకు ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏమీలేదు. అక్కడ దిగుమతి అయిన సరుకు మొత్తానికి చెల్లింపులు జరిగాయి. ఒకసారి శాంపిల్ నెగెటివ్ రిపోర్టు వస్తే ఆ సరుకును వేర్హౌస్ నుంచి బయటకు కదలనివ్వరు. మరోసారి శాంపిల్ పరీక్షకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తారు. లేకుంటే కస్టమ్స్ నిర్ణయంపై అక్కడి కోర్టులో అప్పీలు చేసుకొనేందుకు అనుమతి ఇస్తారు. ఇందుకు అంగీకరించకపోతే దిగుమతి అయిన సరుకును వెనక్కి పంపించాలి. ఇలా కంటైనర్ వెనక్కి వచ్చిందంటే ఎగుమతి వ్యాపారి తీవ్రంగా నష్టపోతాడు. అంతేకాకుండా ఆ మిర్చిని స్థానిక మార్కెట్లో విక్రయించుకోవాలి. అప్పుడు మార్కెట్ కమిటీలకు ఎరైవల్స్ పెరిగి ధర పతనమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో సరుకు దిగుమతి చేసుకొని నగదు చెల్లించకుండా దిగుమతిదారులు సమస్యలు సృష్టించే అవకాశం ఉందని ఎక్స్పోర్టర్లు తెలిపారు. తమ మధ్య వ్యాపార సంబంధాలు దెబ్బ తింటాయని, ఇది మిర్చి ఎగుమతులకు పెనుముప్పుగా పరిణమిస్తుందని చెబుతున్నారు. ఏటా రూ. 10 వేల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని రా బడుతున్న మిర్చి ఎగుమతులు తిరస్కరణకు గురైతే దేశం ఆదాయాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.