Jagan: నాలుగేళ్ల తర్వాత జవాబు చెప్పాలి
ABN , Publish Date - Jun 10 , 2025 | 04:11 AM
సీఎంగా చంద్రబాబు నాలుగేళ్ల తర్వాత తన అరాచక పాలనపై ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని వైసీపీ అధ్యక్షుడు జగన్ హెచ్చరించారు. రాష్ట్రం అరాచకానికి కేరాఫ్గా మారిపోయిందని..

చేసిన తప్పులకు బాధ్యత వహించాలి
చంద్రబాబుకు జగన్ బెదిరింపు
అమరావతి, జూన్ 9(ఆంధ్రజ్యోతి): సీఎంగా చంద్రబాబు నాలుగేళ్ల తర్వాత తన అరాచక పాలనపై ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని వైసీపీ అధ్యక్షుడు జగన్ హెచ్చరించారు. రాష్ట్రం అరాచకానికి కేరాఫ్గా మారిపోయిందని ‘ఎక్స్’లో ఆరోపించారు. చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసి.. కక్షసాధింపు, విషసంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారని ఆరోపించారు. డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్కు ఏం సంబంధమని ప్రశ్నించారు. కొమ్మినేనిపై చంద్రబాబు కక్షకట్టడం ఇదే తొలిసారి కాదని.. 2014-19 మధ్య ఒక చానల్ నుంచి కొమ్మినేనిని ఉద్యోగం నుంచి తొలగింపజేశారని ఆరోపించారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తారో.. రేపు అదే పండుతుందని.. అది రెండింతలవుతుందని బెదిరించారు.