Nadendla Manohar: రేషన్ డోర్డెలివరీ వాహనాల నిలిపివేతకు కసరత్తు
ABN , Publish Date - May 16 , 2025 | 03:17 AM
రేషన్ డోర్డెలివరీ వ్యవస్థను నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లతో చర్చలు ప్రారంభించారు. వాహనాల అంశంపై తుది నిర్ణయం త్వరలో తీసుకునే అవకాశం ఉంది.

ఎండీయూ ఆపరేటర్లు, డీలర్లతో మంత్రి నాదెండ్ల చర్చలు
మరోసారి చర్చలు జరిపి నిర్ణయం తీసుకునే అవకాశం
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా ప్రవేశపెట్టిన రేషన్ డోర్ డెలివరీని నిలిపివేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఆశాఖ ఉన్నతాధికారులు గురువారం రాష్ట్రంలోని రేషన్ డీలర్ల సంఘాల ప్రతినిధులతోనూ, ఎండీయూ ఆపరేటర్స్ (ఎండీయూ ఆపరేటర్స్) సంఘ నాయకులతోనూ విజయవాడలోని సివిల్ సప్లయిస్ భవన్లో విడివిడిగా చర్చలు జరిపారు. రేషన్ సరుకుల పంపిణీ కోసం ఎండీయూ వాహనాలను కొనసాగించాలా? అనే దానిపై సూచనలు, సలహాలు ఇవ్వాలని మంత్రి కోరగా, ఎండీయూ ఆపరేటర్లు, రేషన్ డీలర్లు భిన్నమైన అభిప్రాయాలను వెల్లడించారు. ఎండీయూ వాహనాలను ప్రవేశపెట్టిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని రేషన్ డీలర్లు ఆరోపించగా, వాహనాలను ఇప్పటికిప్పుడు నిలిపివేస్తే తామంతా వీధిన పడతామని ఎండీయూ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తమతో కుదుర్చుకున్న ఒప్పందం 2027 జనవరితో ముగుస్తుందని, అప్పటి వరకు రేషన్ వాహనాలను కొనసాగిస్తే.. ఈలోగా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూసుకుంటామని ఎండీయూ ఆపరేటర్ల సంఘంప్రతినిఽధులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని ఎండీయూ ఆపరేటర్లందరి ఏకాభిప్రాయంతో వారంలోగా ఏదో ఒక నిర్ణయం చెప్పాలని ఆపరేటర్ల ప్రతినిధులకు మంత్రి సూచించినట్లు సమాచారం. మరోసారి సారి చర్చలు జరిపిన తర్వాత రేషన్ వాహనాల నిలిపివేతపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పౌరసరఫరాలశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రజాపంపిణీ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం: మంత్రి నాదెండ్ల
ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల సహకారంతో ముందడుగు వేస్తోందని మంత్రి మనోహర్ తెలిపారు. డీలర్లు, ఎండీయూ ఆపరేటర్ల ప్రతినిధులతోచర్చల అనంతరం ఓప్రకటన విడుదల చేశారు.
2027 వరకు కొనసాగించాలి: ఎండీయూ ఆపరేటర్లు
గత ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ మేరకు 2027-జనవరి వరకు ఎండీయూ వ్యవస్థను కొనసాగించాలని ఎండీయూ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతోపాటు అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకాలకు సరుకులు రవాణా చేసినందుకు తమకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరారు. తమకు అన్యాయం చేయకుండా ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అలాగే, గత ప్రభుత్వం ఎండీయూ వాహనాలకు బీమా ప్రీమియం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, అయితే, ప్రస్తుత ప్రభుత్వం ప్రీమియం సొమ్మును తమ వ్యక్తిగత ఖాతాల నుంచి కట్ చేసిందని పేర్కొన్నారు.