AP Crime Rate: భయం పోయింది.. భద్రత పెరిగింది..
ABN , Publish Date - Jun 14 , 2025 | 05:09 AM
గత వైసీపీ ప్రభుత్వంలో బిక్కుబిక్కు మంటూ బతికిన రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం రాకతో పెద్ద ఉపశమనం లభించింది. ప్రభుత్వం మారితే భయం పోయి భద్రతకు భరోసా ఉంటుందనే వారి నమ్మకం నిజమైంది.

వైసీపీ హయాంలో ఏటా 1.52 లక్షల కేసులు
కూటమి వచ్చాక లక్ష లోపే నమోదు
టెక్నాలజీతో నేరాల అదుపు.. సోషల్ సైకోలకు చెక్
‘ఈగల్’తో గంజాయి స్మగ్లింగ్, సాగు కట్టడి
‘శక్తి’ యాప్తో మహిళలకు భరోసా
పోలీసింగ్ మార్పుతో నేరస్థుల వెన్నులో వణుకు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ ప్రభుత్వంలో బిక్కుబిక్కు మంటూ బతికిన రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం రాకతో పెద్ద ఉపశమనం లభించింది. ప్రభుత్వం మారితే భయం పోయి భద్రతకు భరోసా ఉంటుందనే వారి నమ్మకం నిజమైంది. అరాచకం అంటే ఎలా ఉంటుందో ఐదేళ్లు అనుభవించిన ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అటువంటిది మచ్చుకైనా కనిపించలేదు. ఐదేళ్లు గాడి తప్పిన శాంతిభద్రతలు నేడు అదుపులోకి వస్తున్నాయి. అరాచక శక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రతి పల్లెలో సీసీ కెమెరాలతో నిఘా.. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రోన్లతో పర్యవేక్షణ.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పోలీసింగ్కు శ్రీకారం.. ఫలితంగా నేరస్థుల వెన్నులో వణుకుపుడుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అంచనా వేసేందుకు ఏటా నమోదయ్యే కేసుల సంఖ్య ప్రధాన కొలమానం. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏకంగా 7,61,067 కేసులు నమోదయ్యాయి. సరాసరి రోజుకు 417, నెలకు 12,684, ఏడాదికి 1,52,213 కేసులతో రికార్డు సృష్టించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 జూన్ 1నుంచి 2020 మే 31వరకూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1,86,386 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. తర్వాతి ఏడాది 2020-21లో 1,58,505 కేసులు నమోదయ్యాయి. 2021-22లో మరింత పెరిగి ఆ సంఖ్య 1,66,244కు చేరింది. 2022-23లో 1,38,746 కేసులు.. ఎన్నికల ఏడాది 2023-24లో 1,11,186 ఎఫ్ఐఆర్లు రిజిస్టరయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం గత ఏడాది జూన్లో అధికారంలోకి వచ్చాక నేరాలకు పాల్పడిన వారిని వెతికి పట్టుకుని కేసులుపెట్టి జైలుకు పంపింది. ఏడాది(జూన్ 2024నుంచి మే 2025) కాలంలో నమోదైన కేసుల సంఖ్య 99,675 మాత్రమే. దీనికి కారణం నేరాలను ముందే పసిగట్టే టెక్నాలజీని ఏపీ పోలీసులు అందిపుచ్చుకోవడం. నేరం జరిగితే వేగంగా స్పందించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం..అనుభవజ్ఞుడైన పాలకుడి దిశానిర్దేశం అని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అభిప్రాయపడ్డారు.
నాడు ‘దిశ’ మోసం.. నేడు ‘శక్తి’ ధైర్యం..
జగన్ పాలనలో తాడేపల్లిలోని ఆయన ప్యాలెస్ ముందే గంజాయి బ్యాచ్ దివ్యాంగురాలిపై అఘాయుత్యానికి పాల్పడితే చలించలేదు. కానీ, పొరుగు రాష్ట్రంలో వైద్య విద్యార్థిని హత్యతో ఇక్కడ ‘దిశ’ పేరుతో చట్టం చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. ఐదేళ్లలో ఆ చట్టం అమల్లోకి రాకపోగా కేవలం దిశ యాప్తోనే కాలం వెళ్లదీసి మహిళా లోకాన్ని మోసం చేశారు. మహిళలకు రక్షణగా ఉండాల్సిన పోలీసుల్ని వైసీపీ ఖాకీలుగా మార్చేసి కనీస శిక్షణ లేని మహిళా సంరక్షణ కార్యదర్శులకు యూనిఫామ్ వేసి మహిళా పోలీసులంటూ మభ్య పెట్టారు. ఐదేళ్ల అరాచక పాలనలో మహిళలపై నేరాలకు సంబంధించి 1,34,046 కేసులు నమోదయ్యాయి. ప్రతిపక్ష నేతల కుటుంబాల్లోని మహిళలు మొదలుకొని సొంత చెల్లిపైనే సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ చేయించారు. ప్రభుత్వం మారగానే సోషల్ సైకోలకు చుక్కలు కనిపించాయి. మహిళల్ని సోషల్ మీడియాలో ఒక్క మాట అన్నా టీవీ డిబేట్లలో నీచ వ్యాఖ్యలు చేసినా పోలీసులు లాక్కెళ్లి లాక్పలో పడేశారు. వైసీపీ సోషల్ సైకో వర్రా రవీంద్ర రెడ్డి నుంచి సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్, నీచ వ్యాఖ్యల కృష్ణంరాజు వరకూ ఎవ్వరినీ వదల్లేదు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడిన 174 మందికి గత జూన్ 1 నుంచి ఈ ఏడాది మే 31 మధ్య కోర్టుల ద్వారా శిక్షలు పడ్డాయి. మహిళల రక్షణ కోసం శక్తి యాప్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ ద్వారా ప్రతి మహిళకు, యువతికి పోలీసులు భరోసా ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుశిక్షుతులైన మహిళా పోలీసులతో 164 శక్తి బృందాలను ఏర్పాటు చేసి ఆ విభాగానికి మహిళా ఐజీ రాజకుమారిని హెడ్గా నియమించింది. వైసీపీ పాలనలో ఏటా 26,809 కేసులు నమోదు కాగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో 25,923 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి.
గంజాయి కట్టడికి ‘ఈగల్’..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ పేరు వినిపించేది. మన్యంలో పది వేల హెక్టార్లలో అమాయక గిరిజనులతో సాగు చేయిస్తున్న ముఠాలను అడ్డుకునే పరిస్థితి అప్పట్లో లేదు. ప్రభుత్వం మారగానే గంజాయి కట్టడికి ఐజీ ర్యాంకు అధికారి నేతృత్వం లో 450 మంది పోలీసులతో ‘ఈగల్’ విభాగం ఏర్పాటైంది. గంజాయి సాగుపై స్థానిక పోలీసులతో కలిసి ఉక్కుపాదం మోపడంతో వంద ఎకరాల్లో కూడా ఈ ఏడాది సాగు లేదు. విద్యార్థుల్లో, యువతలో చైత న్యం తీసుకొచ్చి మత్తుకు దూరంగా ఉంచే ప్రయ త్నం సత్ఫలితాలు ఇస్తోంది. వేల సంఖ్యలో అరెస్టు లు, వాహనాలు సీజ్, లక్షల కిలోల గంజాయి దగ్ధం తో పరిస్థితి బాగా అదుపులోకి వచ్చింది. పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఐజీ రవికృష్ణ నేతృత్వంలోని ఈగల్ బృందం కృషి చేస్తోంది.
సామాజిక అణచివేతకు చెక్..
దళిత డ్రైవర్ను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేయడం, మాస్క్ అడిగిన దళిత వైద్యుడు సుధాకర్ను నడిరోడ్డుపై పెడరెక్కలు విరిచి కొట్టడం మొదలుకొని రాజమండ్రిలో దళిత యువకుడికి పోలీసు స్టేషన్లో శిరోముండనం వరకు జగన్ పాలనలో దళితులను ఎంతో హింసించారు. రాజధాని ఎస్సీ రైతులపైనే అట్రాసిటీ కేసులు.. దళిత మహిళకు న్యాయం చేయాలన్నందుకు తెలుగు మహిళ అనిత (ప్రస్తుత హోంమంత్రి)పై కేసులు పెట్టి వేధించడం వరకూ పలు సందర్భాల్లో సామాజికంగా దళితులను అణిచివేసే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితికి కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. గత ప్రభుత్వంలో దళితులపై సగటున ఏడాదికి 2,600 కేసులు నమోదు కాగా ఆ సంఖ్య ప్రస్తుత ప్రభుత్వంలో 2,170కి తగ్గింది.