AP Heatwave: మరో నాలుగు రోజులు ఉక్కపోతే
ABN , Publish Date - Jun 07 , 2025 | 04:40 AM
మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీనికితోడు పడమర దిశ నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తాలో అనేకచోట్ల వేడి, ఉక్కపోత కొనసాగాయి.

10న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
ఆ తరువాత రెండు రోజుల్లో అల్పపీడనం
12 తరువాతే ‘నైరుతి’లో కదలిక
విశాఖపట్నం, అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీనికితోడు పడమర దిశ నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తాలో అనేకచోట్ల వేడి, ఉక్కపోత కొనసాగాయి. శుక్రవారం జంగమహేశ్వరపురంలో 41, కావలిలో 40.6, నెల్లూరులో 40.4, ఒంగోలులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే అక్కడక్కడా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల్లో ఎండ తీవ్రత కొనసాగి వేడి వాతావరణం నెలకొంటుందని, చెదురుమదురుగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలావుండగా ఈనెల 10న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించనున్నదని, దాని ప్రభావంతో ఆ తరువాత రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడుతుందని స్కైమెట్ తెలిపింది. దీంతో ఈనెల 12 తరువాత నైరుతి రుతుపవనాల్లో కదలిక వస్తుందని పేర్కొంది. గత నెల 24న కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు 29 నాటికి పశ్చిమబెంగాల్ వరకూ విస్తరించి, తరువాత నిలిచిపోయాయి. గడచిన ఎనిమిది రోజుల నుంచి పడమర గాలులు వీస్తుండడంతో దక్షిణ భారతం దానికి ఆనుకుని మధ్య, తూర్పు భారతాల్లోని అనేక ప్రాంతాల్లో తేమకు బదులు పొడి వాతావరణం నెలకొంది. దీంతో రుతుపవనాలు ముందుకువెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కాగా ఈనెల 12న ఏర్పడనున్న అల్పపీడనంతో రుతుపవనాల్లో కదలిక వచ్చి మధ్య, తూర్పు భారతంలో పలు ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. అప్పటివరకూ రాష్ట్రంలో ఎండలు కొనసాగుతాయని, మధ్యాహ్నం తరువాత అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వానలు కురుస్తాయని పేర్కొన్నారు. విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.