PROTEST: బడిపిల్లలు అంటే అంత చులకనా..?
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:59 PM
పాఠశాలలు వదిలిన సమయంలో విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళ్తున్న బస్సు డ్రైవర్ల తీరుపై గురువారం మండల కేంద్రంలో వారి తల్లిదండ్రులు, స్థానికులు ధర్నాకు దిగారు. మధ్యాహ్నం పాఠశాలలు వదిలిన సమయంలో యాడికి నుంచి తాడిపత్రి, నిట్టూరు వైపు వెళ్లే విద్యార్థులు బస్సుల కోసం రోడ్డుపై ఎదురుచూస్తున్నారు.

ధర్నాకు దిగిన తల్లిదండ్రులు
యాడికి, ఏప్రిల్17(ఆంధ్రజ్యోతి): పాఠశాలలు వదిలిన సమయంలో విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళ్తున్న బస్సు డ్రైవర్ల తీరుపై గురువారం మండల కేంద్రంలో వారి తల్లిదండ్రులు, స్థానికులు ధర్నాకు దిగారు. మధ్యాహ్నం పాఠశాలలు వదిలిన సమయంలో యాడికి నుంచి తాడిపత్రి, నిట్టూరు వైపు వెళ్లే విద్యార్థులు బస్సుల కోసం రోడ్డుపై ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు విద్యార్థులను ఎక్కించుకోకుండా వేగంగా వెళ్లిపోయాయి. దీనిని గమనించిన కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు.. ద్విచక్రవాహనాల్లో వెంబడించారు. స్థానిక కోనరోడ్డు సర్కిల్లో రోడ్డుకు అడ్డంగా ద్విచక్రవాహనాలు పెట్టి ధర్నాకు దిగారు. బస్సుల డ్రైవర్లు, కండక్టర్లను కిందకు దింపి నిలదీశారు. బడిపిల్లలు అంటే అంత చులకనా.., అటువంటపుడు బస్సు పాసులు ఎందుకు ఇచ్చినట్లు అని మండిపడ్డారు. బడులు వదిలే సమయంలో రోజూ ఇలానే చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. బస్సుల కోసం విపరీతమైన ఎండలో రోడ్డుపై నిలబడి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు. తాడిపత్రి బస్సు డిపో మేనేజర్ వచ్చేదాకా బస్సులు కదలనిచ్చేదిలేదని రోడ్డుపై అడ్డంగా ధర్నాకు దిగారు. బస్సుడ్రైవర్ల తీరును నిరసిస్తూ స్థానికులు పెద్దఎత్తున గుమికూడారు. దీంతో ట్రాఫిక్ పెద్దఎత్తున స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, విద్యార్థుల తల్లిదండ్రులకు, స్థానికులకు సర్దిచెప్పారు. విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళ్లిపోతున్న బస్సు డ్రైవర్లు, కండక్టర్లు మందలించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి పోలీసులు తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు శాంతించడంతో సమస్య సద్దుమణిగింది. బడులు వదిలే సమయంలో బడిపిల్లలను కచ్చితంగా బస్సుల్లో ఎక్కించుకునేలా డిపో మేనేజర్ ఆదేశాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.