Health Department: రెండుసార్లు వైద్య పరికరాల కొనుగోళ్లా
ABN , Publish Date - Jun 23 , 2025 | 03:26 AM
ఒకే రకమైన వైద్య పరికరాలను రెండుసార్లు కొనుగోలు చేసి, రూ.16 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేసిన విషయం బయటకు పొక్కడంతో ఆరోగ్యశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

నివేదిక కోరిన వైద్య మంత్రి, ఆరోగ్యశాఖ
వ్యవహారాన్ని రహస్యంగా ఉంచిన డీఎంఈ అధికారులు
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో వెలుగులోకి..
అమరావతి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఒకే రకమైన వైద్య పరికరాలను రెండుసార్లు కొనుగోలు చేసి, రూ.16 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేసిన విషయం బయటకు పొక్కడంతో ఆరోగ్యశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్(డీఎంఈ), ఆ కార్యాలయ అధికారులకు దాదాపు ఐదు వారాల క్రితం ఈ విషయం తెలిసినా, వ్యవహారాన్ని కప్పిపుచ్చే క్రమంలో తూతూ మంత్రంగా విచారణ చేసి వదిలేశారు. కనీసం ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయానికి కూడా సమాచారం ఇవ్వలేదు. అనంతపురం ఆస్పత్రికి సంబంధించిన ఈ వ్యవహారంపై ‘కొనుగోళ్లలో కాసుల వర్షం!’ శీర్షికన ఆదివారం ‘ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం రావడంతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది.
ఒకే రకమైన వైద్య పరికరాలు రెండుసార్లు ఎందుకు కొనుగోళు చేశారు? ఎంత నిధులు దుర్వినియోగమయ్యాయి?. ఆ పరికరాలు ఇప్పుడు ఎక్కడున్నాయి?.. ఇలా పూర్తిస్థాయి సమాచారం ఇవ్వాలని డీఎంఈని, అనంతపురం ఆస్పత్రి అధికారులను నివేదిక కోరారు. మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు ఆయన కార్యాలయం కూడా సోమవారం నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. డీఎంఈ అధికారుల విచారణలో ఈ మొత్తం వ్యవహారం బయటికి వచ్చినా సూపరింటెండెంట్ మీద కానీ, ఈఈ మీద కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పైగా తొలుత, రెండోసారి కొనుగోలు చేసిన వైద్య పరికరాలకు రూ.16 కోట్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ వ్యవహారంలో సూపరింటెండెంట్, ఈఈతో పాటు డీఎంఈ అధికారులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.