Nandamuri Balakrishna: ఏపీలో వెయ్యి పడకల క్యాన్సర్ ఆస్పత్రి నిర్మిస్తాం
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:39 AM
బసవతారకం క్యానర్ ఆస్పత్రి 110 పడకలతో ప్రారంభమై ప్రస్తుతం 700కుపైగా పడకలకు విస్తరించిందని ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు.

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవాల్లో బాలకృష్ణ వెల్లడి
హైదరాబాద్ సిటీ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): బసవతారకం క్యానర్ ఆస్పత్రి 110 పడకలతో ప్రారంభమై ప్రస్తుతం 700కుపైగా పడకలకు విస్తరించిందని ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. త్వరలోనే ఏపీలో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించనున్నామని చెప్పారు. లాభాపేక్ష లేకుండా, పేద, ధనిక భేదాలు, వివక్ష చూపకుండా క్యాన్సర్ బాధితులందరికీ చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. వేదికపై ఉన్న తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహను ఉద్దేశిస్తూ.. ఆయన పేరుతో ఓ సినిమా తీయాలని ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రజతోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా దేశంలోనే మొదటిసారిగా బసవతారకం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక లీనియర్ యాక్సిలేటర్ రేడియోథెరపీ యంత్రాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ.. రోగులకు గుండె సంబంధిత పరీక్షలు, చికిత్స అందించడానికి ఏర్పాటు చేసిన ఆధునిక క్యాథ్ల్యాబ్ను మంత్రి రాజనర్సింహ ప్రారంభించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో లిఫ్టును ఒక దివ్యాంగుడు నిర్వహించడం చూసి సంతోషించానని.. ఈ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో దివ్యాంగులకు ఉపాధి కల్పించవచ్చేమో ఆలోచించాలని మంత్రి దామోదర రాజనర్సింహకు గవర్నర్ సూచించారు. బాలకృష్ణ తనను కలవడానికి వచ్చినపుడు ఒక సినీ హీరో వచ్చారని భావించానని.. కానీ ఆయనతో మాట్లాడాక గ్రేట్ హీరో విత్ ఏ మిషన్ అని తెలిసిందన్నారు.