జూలైలోగా రాష్ట్రమంతా ‘సంజీవని’
ABN , Publish Date - Apr 01 , 2026 | 06:29 AM
మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సంజీవని ప్రాజెక్టును జూలైలోగా...
మెరుగైన ప్రజారోగ్యం కోసం ఉద్యమంలా కృషి చేయాలి: సీఎం
అమరావతి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సంజీవని ప్రాజెక్టును జూలైలోగా రాష్ట్రమంతా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రతినెలా నాలుగో శనివారం స్వర్ణాంధ్ర-పాపులేషన్ మేనేజ్మెంట్ గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. మంగళవారం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా కుప్పం, నారావారి పల్లెలో సమర్థంగా అమలవుతున్న ఈ ప్రాజెక్టును జూలై నాటికల్లా రాష్ట్రమంతటా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే.. ఇందుకోసం 904 మొబైల్ మెడికల్ యూనిట్స్ కావాలని, అందుకు రూ.162 కోట్లు వ్యయం అవుతుందని వివరించారు. స్పందించిన సీఎం.. కొత్త మొబైల్ మెడికల్ వాహనాల ఏర్పాటుకు అంగీకారం తెలిపారు.