Share News

Siddipet: బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Jun 02 , 2025 | 05:24 AM

తల్లిదండ్రులు తనకు బీఎండబ్ల్యూ కారు కొనివ్వడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం చాట్లపల్లి గ్రామంలో జరిగింది.

Siddipet: బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

  • అంత స్థోమత లేదని తల్లిదండ్రులు చెప్పినా వీడని మంకుపట్టు

  • మరో కారు కొనిస్తానని తండ్రి చెప్పినా.. ఒప్పుకోని వైనం

  • వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం

  • చికిత్స పొందుతూ మృతి సిద్దిపేట జిల్లా చాట్లపల్లిలో ఘటన

జగదేవ్‌పూర్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులు తనకు బీఎండబ్ల్యూ కారు కొనివ్వడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం చాట్లపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బొమ్మ కనకయ్య, కనకమ్మల కుమారుడు జానీ (21) పదో తరగతి వరకు చదివాడు. చదువు మానేసి తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. తనకు బీఎండబ్ల్యూ కారు కొనివ్వాలని లేదంటే చనిపోతానని కొద్ది రోజులుగా వారిని బెదిరించేవాడు.


అంత పెద్ద కారు కొనే స్తోమత తమకు లేదని తల్లిదండ్రులు చెప్పినా వినకుండా వారిని ఇబ్బందులకు గురి చేసేవాడు. అతడి బాధలను భరించలేని తల్లిదండ్రులు శుక్రవారం సిద్దిపేటలోని కారు షోరూంకు తీసుకెళ్లి మారుతి స్విఫ్ట్‌ డిజైర్‌ కారు కొనిస్తామని చెప్పగా తనకు నచ్చిన కారు కొనివ్వడం లేదని జానీ మనస్తాపం చెందాడు. తనకు మరో కారు వద్దంటూ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఆర్వీఎం ఆసుపత్రిలో చేర్పించగా శనివారం మృతి చెందాడు.

Updated Date - Jun 02 , 2025 | 05:24 AM