Share News

TSRTC: బస్‌పాస్‌ చార్జీల బాదుడు

ABN , Publish Date - Jun 10 , 2025 | 06:43 AM

బస్‌పాస్‌ చార్జీలను తెలంగాణ ఆర్టీసీ పెంచింది. విద్యార్థులు, ఎన్జీవోలతోపాటు సాధారణ ప్రజల బస్‌పాస్‌ చార్జీలను 20 శాతానికి పైగా పెంచింది. సోమవారం నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. విద్యార్థులకు రూట్‌ పాస్‌ (హైదరాబాద్‌, వరంగల్‌) ప్రస్తుతం 4 కిలోమీటర్ల వరకు రూ.150 వసూలు చేస్తుండగా...

TSRTC: బస్‌పాస్‌ చార్జీల బాదుడు

  • 20 శాతానికి పైగా పెంచిన ఆర్టీసీ

  • విద్యార్థుల బస్‌పాస్‌ ధర 50ు పెంపు

  • ఇకపై హైదరాబాద్‌లో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ విద్యార్థులకు అనుమతి

  • పెంపుతో ఆర్టీసీకి నెలకు రూ.2 కోట్లు

  • టోల్‌ప్లాజా వినియోగ చార్జీల సవరణ

హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): బస్‌పాస్‌ చార్జీలను తెలంగాణ ఆర్టీసీ పెంచింది. విద్యార్థులు, ఎన్జీవోలతోపాటు సాధారణ ప్రజల బస్‌పాస్‌ చార్జీలను 20 శాతానికి పైగా పెంచింది. సోమవారం నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. విద్యార్థులకు రూట్‌ పాస్‌ (హైదరాబాద్‌, వరంగల్‌) ప్రస్తుతం 4 కిలోమీటర్ల వరకు రూ.150 వసూలు చేస్తుండగా ఆ మొత్తాన్ని రూ.225కి పెంచారు. రూట్‌పాస్‌ గరిష్ఠంగా 22 కి.మీ.కు రూ.450 ఉండగా దాన్ని రూ.675కి పెంచారు. జిల్లాల్లో ప్రతి నెలా రూట్‌పా్‌సకు 5 కి.మీ. వరకు రూ.150 ఉండగా దాన్ని రూ.225కి పెంచారు. గరిష్ఠంగా 35 కి.మీ.కు రూ.550 ఉండగా రూ.825కి పెంచారు. విద్యార్థుల సాధారణ పాస్‌ (నెలవారీ) రూ.400 నుంచి రూ.600కు పెంచారు. 3 నెలలకు రూ.1200 నుంచి రూ.1800కు పెంచారు. విద్యార్థుల బస్‌పాస్‌ చార్జీలు పెంచినప్పటికీ ఇకపై హైదరాబాద్‌లో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ అనుమతించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల తలెత్తుతున్న ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విద్యార్థుల బస్‌పాస్‌ చార్జీలు గత మూడేళ్లుగా పెంచలేదన్నారు. ప్రస్తుతం పెరిగిన ఖర్చుల కారణంగా విద్యార్థి, సాధారణ ప్రయాణికుల బస్‌పా్‌సల ధరలు పెంచినట్లు అధికారులు వెల్లడించారు. పెంచిన ధరలతో ఆర్టీసీకి ప్రతి నెల సుమారు 2కోట్ల వరకు ఆదాయం సమకూరనుంది. కాగా, ఈ పెంపు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల బస్‌పా్‌సలు సుమారు 11 లక్షల వరకు ఉన్నాయి.


టోల్‌ప్లాజా వినియోగ చార్జీల సవరణ..

టోల్‌ప్లాజా వినియోగ చార్జీలను సైతం ఆర్టీసీ సవరించింది. ఒక్కో ప్రయాణికుడి నుంచి ఇకపై ప్రతి టోల్‌ప్లాజాకు రూ.10 వసూలు చేయనుంది. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టోల్‌ప్లాజా మీదుగా రోజూ సుమారు 6 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కాగా, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఏటా టోల్‌ రుసుమును సవరిస్తోందని, దానికి అనుగుణంగా వినియోగ చార్జీలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 24 జారీ చేసిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆ మేరకు టోల్‌ ప్లాజా వినియోగ చార్జీని సవరించినట్లు చెప్పారు.

పెంచిన చార్జీలను ఉపసంహరించండి: సీపీఎం

బస్‌పాస్‌ చార్జీలను 20 శాతానికి పైగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపంసహరించుకోవాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. చార్జీలు పెంచడం ద్వారా సాధారణ ప్రజలు, విద్యార్థులపై భారం పడుతోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఒక్కో ప్రయాణికుడిపై నెలకు రూ.250-300 వరకు అదనపు భారం పడుతుందన్నారు. తక్షణమే పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 10 , 2025 | 06:45 AM