Uttam: కాళేశ్వరం లేకున్నా రికార్డు వరి పంట
ABN , Publish Date - May 30 , 2025 | 04:42 AM
ఖరీఫ్, రబీ సీజన్లలో 285 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి చెప్పారు.

ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తొలి స్థానం తెలంగాణదే..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షలో మంత్రి ఉత్తమ్
కరీంనగర్, మే 29(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖరీఫ్, రబీ సీజన్లలో 285 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం కారణంగా 3బ్యారేజీల్లో నీటి ని నిలపలేని పరిస్థితి నెలకొందని.. అయినా అత్యధిక వరిధాన్యం పండించి, తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్లో ఉత్తమ్ అధ్యక్షతన ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో కూడా ఏనాడు ఈ స్థాయిలో వరి పండలేదన్నారు.
ధాన్యం కొనుగోలు చేసిన 48గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నామన్నారు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి కేసీఆర్కు నోటీసులు పంపించిందన్నారు. కమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టంచేశారు. ఎస్సారెస్పీ, జూరాల, నిజాంసాగర్ తదితర ప్రాజెక్టుల్లో పూడిక తీసి, వాటి సామర్థ్యం పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు అధికారికంగా ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో మం త్రులు శ్రీధర్బాబు, పొన్నం, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.