Uttam: రెండేళ్లలో ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాం
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:07 AM
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు.

సొరంగం పనుల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు
సైనిక హెలికాప్టర్ల సాయంతో ఎలక్ట్రోమాగ్నటిక్ సర్వే నిర్వహిస్తాం
రక్షణ శాఖ సహాయం కోరాం...
కేంద్రం అంగీకరించింది: ఉత్తమ్
న్యూఢిల్లీ, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. సొరంగం ప్రమాద మృతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకున్నామని, ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ఠ ప్రణాళికతో ముందుకెళుతున్నామని చెప్పారు. బుధవారం ఢిల్లీలో ఆయన రక్షణ శాఖ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఎస్ఎల్బీసీ సొరంగం నిడివి 44 కిలోమీటర్లు ఉండగా, ఇప్పటికే 35 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయని తెలిపారు. మరో 9 కి.మీ. అటవీ ప్రాంతంలో ఉండడంతో ఆర్మీ, ఎయిర్ఫోర్స్ సహాయం కోరగా అంగీకరించారని చెప్పారు. ఆ ప్రాంతం పులుల అభయారణ్యంగా ఉన్నందున ఎలక్ట్రోమాగ్నటిక్ సర్వే చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనికోసం కల్నల్ పరీక్షిత్ మెహరా, సరిహద్దు రోడ్డు సంస్థ మాజీ డీజీ జనరల్ హర్పాల్ సింగ్ను డిప్యుటేషన్పై తెలంగాణకు పంపేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పరీక్షిత్ మెహరా రెండేళ్లపాటు కొనసాగుతారని చెప్పారు.
ఎస్ఎల్బీసీతో పాటు దేవాదుల, సీతారామ తదితర ప్రాజెక్టుల పనుల్లో ఆయన సేవలను వినియోగించుకుంటామన్నారు. జనరల్ హర్పాల్ సింగ్ గౌరవ సలహాదారుగా ఉంటారన్నారు. డెన్మార్క్ నుంచి అత్యాధునిక ఎలక్ట్రోమాగ్నటిక్ సర్వే పరికరాలు తీసుకొస్తున్నామని చెప్పారు. వాటిని హెలికాప్టర్కు అమర్చి సొరంగం నిడివి 44 కి.మీ మేర భూమి లోపల కిలోమీటరు వరకు పరిస్థితిని తెలుసుకుంటామన్నారు. ఈ సర్వే ద్వారా సొరంగం వాస్తవ పరిస్థితిని అంచనా వేయొచ్చన్నారు. 9 కి.మీ. మేరకే సొరంగం పనులు పెండింగ్లో ఉన్నప్పటికీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం 44 కి.మీ. సర్వే చేయాలని నిర్ణయించామని తెలిపారు. జూలై 12 నుంచి సర్వే ప్రారంభమవుతుందని, వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.