Sridhar Babu: యువతను నైపుణ్య మానవ వనరులుగా తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:31 AM
పారిశ్రామిక అవసరాలకనుగుణంగా అన్ని రంగాల్లో తెలంగాణ యువతను నైపుణ్యవంతులైన మానవ వనరులుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు.

డిమాండ్ గల కోర్సులపై దృష్టి సారించండి
గ్రామీణ అభ్యర్థులకు సాఫ్ట్ స్కిల్స్పై ప్రత్యేక శిక్షణ
స్కిల్ వర్సిటీ అధికారులకు మంత్రి దుద్దిళ్ల దిశా నిర్దేశం
హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక అవసరాలకనుగుణంగా అన్ని రంగాల్లో తెలంగాణ యువతను నైపుణ్యవంతులైన మానవ వనరులుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ ఆఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఈఎ్సఐసీ)లో ఏర్పాటుచేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రాంగణాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. అటుపై యూనివర్సిటీ అధికారులతో జరిగిన సమీక్షలో వారికి దిశానిర్దేశం చేశారు.
తెలంగాణను అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులకు చిరునామా మార్చాలన్న సంకల్పంతోనే తమ ప్రభుత్వం.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని శ్రీధర్బాబు పేర్కొన్నారు. రాష్ట్ర యువతలో ప్రతిభకు కొదవ లేదని.. మార్కెట్ అవసరాలకనుగుణంగా నైపుణాభివృద్ధిలో శిక్షణనిస్తే మరింత మెరుగవుతారని చెప్పారు. యూనివర్సిటీ కోర్సుల రూపకల్పనలో పరిశ్రమలను భాగస్వాములను చేయాలని ఆయన సూచించారు. పరిశ్రమల నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామీణ అభ్యర్థులకు సాఫ్ట్ స్కిల్స్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని మంత్రి దుద్దిళ్ల కోరారు.