Manda Krishna Madiga: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం పోరాడతా
ABN , Publish Date - Jun 25 , 2025 | 07:12 AM
చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాడుతానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. ఆయనకు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసిన నేపథ్యంలో ..

మంద కృష్ణమాదిగ
రాజేంద్రనగర్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాడుతానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రకటించారు. ఆయనకు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసిన నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎస్సీ, ఎస్టీ అద్యాపకులు, తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తల సంఘం, వ్యవసాయ-వెటర్నరీ- ఉద్యానవన విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో మంగళవారం రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో మందకృష్ణ మాదిగను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ 30 ఏళ్లపాటు న్యాయమైన పోరాటం చేసిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి సహకరించిన ప్రధాని మోదీకి మందకృష్ణ మాదిగ ధన్యవాదాలు తెలిపారు. లోక్సభలో మాదిరిగా రాజ్యసభలోనూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎన్నికల హామీకి అనుగుణంగా వికలాంగులకు రూ.6,000 పెన్షన్ ఇవ్వాలని జూలైలో కార్యాచరణతో పోరాడుతామన్నారు. పలు సామాజిక అంశాలపై ఎమ్మార్పీఎస్ పోరాడిందని ఆయన గుర్తు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు రావాల్సిన మందకృష్ణ మాదిగ సాయంత్రం 4.30 గంటలకు వచ్చినా.. సాయంత్రం 7.45 గంటల వరకూ ఆయన కోసం అందరూ వేచి ఉన్నారు.