Konda Surekha: పజా ప్రభుత్వంపై పెరిగిన విశ్వాసం
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:01 AM
ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించడంతో ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందని మంత్రి కొండా సురేఖ అన్నారు.

‘మంత్రులతో ముఖాముఖి’లో కొండా సురేఖ
వందకు పైగా వినతులు, ఫిర్యాదుల స్వీకరణ
హైదరాబాద్, జూన్ 11(ఆంధ్రజ్యోతి): ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించడంతో ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజా ప్రభుత్వంలోనే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. బుధవారం గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖిలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి దాదాపు వందకు పైగా వినతులు, ఫిర్యాదులు రాగా.. మంత్రి అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... తమ ప్రభుత్వ పనితీరుపై ఉన్న నమ్మకం వల్లే... ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు.
ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, రాజీవ్ యువ వికాసం, రెవెన్యూ భూ వివాదాలు.. తదితర సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు. సంబంధిత అధికారులకు వెంటనే ఫోన్ చేసి వచ్చిన ఫిర్యాదుల వివరాలు తెలియజేసి వాటిని పరిష్కరించాలని ఆదేశాలిచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం.. ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకుంటోందని చెప్పారు.