TG High Court: భూదాన్ కేసును కొట్టేయలేం..
ABN , Publish Date - May 22 , 2025 | 08:13 AM
నాగారం భూదాన్ భూకుంభకోణం కేసులో ఈడీ వేసిన కేసును కొట్టేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లకు ఉపశమనం కల్పించలేమని పేర్కొంటూ, ఈడీకి నోటీసులు జారీ చేసి విచారణను జూన్కు వాయిదా వేసింది.

పిటిషనర్లకు ఏ ఉపశమనం కల్పించలేమన్న హైకోర్టు ధర్మాసనం
వివరణ ఇవ్వాలంటూ ఈడీకి నోటీసులు.. జూన్కు విచారణ వాయిదా
హైదరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): నాగారం భూదాన్ భూకుంభకోణం వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పెట్టిన కేసులో పిటిషనర్లకు అనుకూలంగా ఎలాంటి ఉపశమనం కల్పించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది తీవ్ర అభియోగాలున్న భూకుంభకోణానికి సంబంధించిన నేరంగా గుర్తించినట్లు వెల్లడించింది. తమపై ఈడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కీలక నిందితులుగా ఉన్న మునావర్ఖాన్, ఖాదర్ ఉన్నిసా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ నర్సింగ్రావు ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. తీవ్ర అభియోగాలతోపాటు పెద్ద ఎత్తున భూఆక్రమణ, రూ.వంద కోట్లు మేర ఆర్థిక అక్రమాలు ఇమిడి ఉన్నందున కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వరాదన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఈడీకి ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రజాప్రయోజనం ఇమిడి ఉండటంతోపాటు తీవ్ర ఆరోపణలున్న నేపథ్యంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీ చేస్తూ విచారణను జూన్కు వాయిదా వేసింది.