Duddilla Sridhar Babu: హక్కుల సంరక్షకులు న్యాయవాదులు
ABN , Publish Date - Jul 27 , 2025 | 04:42 AM
న్యాయవాదులు కేవలం కోర్టు అధికారులు మాత్రమే కాదని, రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రసాదించిన హక్కులకు సంరక్షులు అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కొనియాడారు.

ఎల్లప్పుడూ న్యాయం పక్షానే ఉండాలి: శ్రీధర్ బాబు
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): న్యాయవాదులు కేవలం కోర్టు అధికారులు మాత్రమే కాదని, రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రసాదించిన హక్కులకు సంరక్షులు అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కొనియాడారు. ప్రపంచ యవనికపై తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తున్న హైదరాబాద్ ‘ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్’గా మారుతోందని అన్నారు. నోవాటెల్ హెచ్ఐసీసీలో లెక్స్ విట్నెస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘ది గ్రాండ్ మాస్టర్ 2025’ హైదరాబాద్ ఎడిషన్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ‘ఒక న్యాయవాదిగానే నా ప్రస్థానం మొదలయ్యింది. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చాను.
అప్పటికీ.. ఇప్పటికీ న్యాయ వ్యవస్థలో అనేక మార్పులొచ్చాయి. ముఖ్యంగా సాంకేతికత వినియోగం గణనీయంగా పెరిగింది. ఏఐ ఆధారిత న్యాయ పరిశోధన, వర్చువల్ కోర్టు రూమ్లు, రియల్ టైమ్ కేసు ట్రాకింగ్, ఈ-ఫైలింగ్ లాంటివి అందుబాటులోకొచ్చాయి. న్యాయవాద వృత్తిని కేవలం జీవనోపాధిగా మాత్రమే చూడొద్దు. సమాజం పట్ల ఒక బాధ్యతగా భావించాలి. రాజ్యాంగ పీఠిక ప్రకారం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందించేందుకు కృషి చేయాలి. ఎల్లప్పుడూ న్యాయం పక్షానే ఉండాలి’ అని ఆయన యువ న్యాయవాదులకు సూచించారు. కార్యక్రమంలో లెక్స్ విట్నెస్ ప్రతినిధులు అభిజిత్, శ్రీనివాస్, పలు కంపెనీల లీగల్ ప్రతినిధులు పాల్గొన్నారు.