DRDO: రూ.20 వేలకే కార్బన్ ఫైబర్ కృత్రిమ పాదాలు
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:42 AM
కాలు విరిగిన లేదా పాదం కోల్పోయిన వారికి శుభవార్త! హైదరబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవల్పమెంట్ ల్యాబోరేటరీ (డీఆర్డీఎల్) దేశీయ పరిజ్ఞానంతో అత్యాధునిక కార్బన్ ఫైబర్ కృత్రిమ పాదాలను (కార్బన్ ఫైబర్ ప్రొస్థెటిక్ ఫూట్) అభివృద్ధి చేసింది.

దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన డీఆర్డీఎల్
125 కిలోల బరువును తట్టుకోగల సామర్థ్యం
అల్వాల్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కాలు విరిగిన లేదా పాదం కోల్పోయిన వారికి శుభవార్త! హైదరబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవల్పమెంట్ ల్యాబోరేటరీ (డీఆర్డీఎల్) దేశీయ పరిజ్ఞానంతో అత్యాధునిక కార్బన్ ఫైబర్ కృత్రిమ పాదాలను (కార్బన్ ఫైబర్ ప్రొస్థెటిక్ ఫూట్) అభివృద్ధి చేసింది. ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పాదాలతో పోలిస్తే దాదాపు పదిరేట్లు తక్కువ ధరకే, అంటే కేవలం 20 వేలకే అందుబాటులోకి రానుంది. బీబీనగర్ ఎయిమ్స్లో డీఆర్డీఎల్ డైరెక్టర్, శాస్త్రవేత్త జీఏ శ్రీనివాసమూర్తి, ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహంతేమ్ శాంతసింగ్తో కలిసి సోమవారం ఈ కృత్రిమ పాదాలను ఆవిష్కరించారు.
రక్షణమంత్రిత్వశాఖకు చెందిన డీఆర్డీఎల్- డీఆర్డీవో సంయుక్తంగా ఈ‘ఆప్టిమైజ్ కార్బన్ ఫుట్ ప్రొస్థెసి్స’ను రూపొందించాయి. దీనిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేశారు. ఈ కృత్రిమ పాదం 125 కిలోల బరువు ఉన్న వ్యక్తులను కూడా మోయగలిగే సామర్థ్యం కలిగి ఉంది. వేగంగా నడిచేవారు, పరిగెత్తేవారు, దైనందిన పనులు చేసుకునే వారికి అనుకూలంగా 3 రకాలుగా దీనిని రూపొందించారు. తక్కువ ధరకే అందించడం దీని ప్రధాన ఉద్దేశం అని డీఆర్డీఎల్ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి తెలిపారు.