మరో నాలుగు రాజన్న కోడెలు మృతి
ABN , Publish Date - Jun 02 , 2025 | 05:20 AM
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం గోశాలలో కోడెల మృత్యుఘోష ఆగడం లేదు. ఆదివారం తిప్పాపూర్ గోశాలలో మరో నాలుగు కోడెలు అనారోగ్యంతో చనిపోయాయి.

ఇప్పటి వరకు గోశాలలో17 జీవాల మృత్యువాత
500 పశువులకు ఎల్ఎస్ డీ టీకాలు
64 కోడెలను రైతులకు అందజేసిన కలెక్టర్ ఝా
సిరిసిల్ల, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం గోశాలలో కోడెల మృత్యుఘోష ఆగడం లేదు. ఆదివారం తిప్పాపూర్ గోశాలలో మరో నాలుగు కోడెలు అనారోగ్యంతో చనిపోయాయి. దీంతో చనిపోయిన జీవాల సంఖ్య 17కు చేరింది. అనారోగ్యం బారిన పడిన కోడెలకు చికిత్స అందించడానికి ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. గోశాలలో సామర్థ్యానికి మించి కోడెల సంఖ్య పెరిగిపోవడంతో ఆదివారం కలెక్టర్ సందీ్పకుమార్ ఝా పర్యవేక్షణలో జిల్లాలోని రైతులకు 64 కోడెలను పంపిణీ చేశారు.
కోడెల మృతి, అనారోగ్యం బారిన పడిన కోడెలకు అందిస్తున్న చికిత్సపై జిల్లా పశుసంవర్ధక శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. వేములవాడ ఆలయానికి సంబంధించి తిప్పాపూర్ గోశాలలో ఉన్న కోడెల రక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టామని, కోడెలు పూర్తిగా ఆరోగ్యంగా అయ్యే వరకు వైద్య శిబిరం నిర్వహిస్తామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ అధ్యక్షతన కోడెల ఆరోగ్యాన్ని పరిశీలించి 500 పశువులకు ఎల్ఎ్సడీ వ్యాక్సిన్ వేశామని, అనారోగ్యంతో ఉన్న 20 పశువులకు ప్రత్యేక చికిత్స అందించామని తెలిపారు.గోశాలలో ఇప్పటి వరకు 17 కోడెలు అనారోగ్యంతో మరణించాయని మిగిలిన పశువులు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు.