అన్ని రంగాల్లో బీసీల అణచివేత: తీన్మార్ మల్లన్న
ABN , Publish Date - Apr 07 , 2025 | 05:04 AM
దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలను అన్ని రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేస్తున్నాయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శించారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలను అన్ని రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేస్తున్నాయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శించారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సామాజిక రంగాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం దక్కడంలేదన్నారు. బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేసిన బిల్లులను కేంద్రం ఆమోదించాలని, దేశవ్యాప్తంగా కులగణన చేయాలని బీసీ ఆజాదీ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగా ణ భవన్లో బత్తుల సిద్దేశ్వర్ చేపట్టిన బీసీ ఆజాదీ ఆమరణ దీక్షకు ఆదివారం తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల హక్కుల సాధన కోసం పోరాటాలను తీవ్రతరం చేస్తామన్నారు. జక్కని సంజయ్ మాట్లాడుతూ.. తాము బీసీల హక్కుల కోసం ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, బీసీ ప్రధానిగా చెప్పుకునే నరేంద్ర మోదీకి బీసీలపై ప్రేమ లేదా? అని ప్రశ్నించారు. దీక్షలో రజక రిజర్వేషన్ల పోరాట సమితి అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే, అంబేడ్కర్ ఆజాదీ సంఘం అధ్యక్షుడు కొంగర నరహరి తదితరులు పాల్గొన్నారు.