Asaduddin Owaisi: భారత భూమి కోసం ప్రాణాలు అర్పిస్తాం.. పాక్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు: అసదుద్దీన్
ABN , Publish Date - May 10 , 2025 | 05:40 PM
భారత్లోని హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, భారత ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.

భారత్లోని హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, భారత ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) పేర్కొన్నారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఉర్దూ జర్నలిస్ట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు చేశారు (Operation Sindoor).
ఇస్లాం పేరుతో పాకిస్తాన్ (Pakistan) మారణహోమం సృష్టిస్తోందని, పహాల్గామ్లో అతికిరాతకంగా అమాయక ప్రజలను హతమార్చిందని విమర్శించారు. అందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్తో భారత సైనికులు సరైన సమాధానం ఇస్తున్నారని, పాక్ భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. దేవుడి దయ వల్లే మనమందరం భారత్లో జన్మించామని, పవిత్ర మాసంలో చిన్నపిల్లలు, అమాయకులను చంపే పాక్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని అన్నారు.
అమాయకులను, చిన్నపిల్లలను చంపాలని ఇస్లాం చెప్పలేదని, ఇస్లాం పేరుతో పాక్ అసత్య ప్రచారం చేస్తోందని మండి పడ్డారు. పాక్ దాడులపై భారత్ వెనక్కి తగ్గేది లేదని, భారత ముస్లింలు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారని అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ మనదేశంలోని సామాన్యులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతోందని, దానికి తగిన మూల్యం చెల్లిచుకుంటుందని ఒవైసీ అన్నారు.