Jupalli Krishnarao: గిన్నిస్ రికార్డుల్లోకి 63 అడుగుల బతుకమ్మ
ABN , Publish Date - Sep 19 , 2025 | 06:52 AM
ఎల్బీ స్టేడియంలో ఈ నెల 28న 10వేల మంది బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నామని, గిన్నిస్ బుక్ రికార్డుల్లో చేర్చేలా 63 అడుగుల ఎత్తైన బతుకమ్మను ఏర్పాటు చేయనున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు...
ఎల్బీ స్టేడియంలో 10వేలమందితో సంబరాలు
రాష్ట్రవ్యాప్తంగా 21 నుంచి 31 దాకా వేడుక
వరంగల్ వేయి స్తంభాల గుడిలో ప్రారంభం
ప్రజ భాగస్వాములు కావాలి: జూపల్లి
గతంలో బతుకమ్మను రాజకీయం చేశారు
పార్టీలకతీతంగా వేడుక: మహేశ్గౌడ్
హైదరాబాద్, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఎల్బీ స్టేడియంలో ఈ నెల 28న 10వేల మంది బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నామని, గిన్నిస్ బుక్ రికార్డుల్లో చేర్చేలా 63 అడుగుల ఎత్తైన బతుకమ్మను ఏర్పాటు చేయనున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నామని తెలిపారు. 21న వరంగల్లోని వేయి స్తంభాల గుడి వద్ద ప్రారంభం కానున్న సంబరాలు.. 31వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఈ వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్ మాట్లాడుతూ ఎంగిలి పువ్వుల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. బతుకమ్మను కొందరు రాజకీయం చేయడంతో 2000వ సంవత్సరం నుంచే ఈ పండుగ జరుగుతోందన్న అపోహ ఉందన్నారు. పార్టీలకు అతీతంగా పండుగను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని బతుకమ్మ కుంటను కాపాడడంలో సీఎం రేవంత్రెడ్డి, వి.హన్మంతరావు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.