Share News

Samsung Galaxy Triple Fold: శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్.. ఈ ఏడాదే విడుదల కానుందా

ABN , Publish Date - May 25 , 2025 | 10:33 AM

సరికొత్త డిజైన్‌తో ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్‌ను శాంసంగ్ ఈ సెప్టెంబర్‌లోనే విడుదల చేస్తుందన్న వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అయితే, సంస్థ మాత్రం ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు.

Samsung Galaxy Triple Fold: శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్.. ఈ ఏడాదే విడుదల కానుందా
Samsung Galaxy Triple Fold

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ ఫోల్డబుల్ ఫోన్‌లపై దృష్టి పెట్టాయి. యాపిల్ కూడా రంగంలోకి దిగింది. పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తోంది. ఇప్పటికే శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో శాంసంగ్ పైచేయి కూడా సాధించింది. అయితే, ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్‌ను కూడా విడుదల చేసేందుకు సంస్థ సిద్ధమవుతోందన్న వార్త ప్రస్తుతం టెక్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే సంస్థ విడుదల చేసిన గాలెక్సీ ఎస్25 అల్ట్రా, గాలెక్సీ ఎస్25 ఎడ్జ్ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో, ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్‌లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సెప్టెంబర్‌లోనే ఇది విడుదలయ్యే అవకాశం ఉంది.

యోగేష్ బ్రార్ అనే టిప్‌స్టర్ ఈ విషయాలను నెట్టింట పంచుకున్నాడు. ఇదే నిజమైతే మాత్రం ఫోన్ల రంగంలో మరో కొత్త శకం ప్రారంభమైనట్టే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఫోన్‌ను తొలుత దక్షిణ కొరియా, చైనాల్లోనే విడుదల చేస్తారట. ఫోన్ తయారీలో సవాళ్లు, ఫార్మ్ ఫ్యాక్టర్ తదితరాల కారణంగా పరిమిత స్థాయిలో వీటిని విడుదల చేసేందుకు శాంసంగ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.


ప్రస్తుతం ఉన్న శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లతో పోలిస్తే ట్రిపుల్ ఫోల్డ్ భిన్నంగా ఉంటుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో డ్యుయెల్ హింజ్ మెకానిజం ఉంటుందట. అంటే ఇది ఆంగ్ల అక్షరం జెడ్ ఆకారంలో తెరుచుకుంటుందని చెబుతున్నారు. దీంతో, డిస్‌ప్లే ఏరియా మరింత పెద్దగా మారుతుందని చెబుతున్నారు. హువావేకు చెందిన మేట్ ఎక్స్ అల్టిమేట్ డిజైన్ కాన్సెప్ట్‌ను పోలి ఉండొచ్చని కూడా కొందరు అంటున్నారు.

అయితే, మూడు హింజ్‌లు ఉన్న డిజైన్‌లకు కూడా శాంసంగ్ గతంలోనే పేటెంట్ దరఖాస్తు చేసుకుంది. ఒకేసారి నాలుగు డిస్‌ప్లే పానల్స్ అనుసంధానం చేసేందుకు ఈ డీజైన్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే, ఈ డీజైన్‌ను ప్రస్తుత మోడల్‌లో వినియోగిస్తున్నారా లేదా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. సంప్రదాయిక ఫోల్డబుల్ ఫోన్లు స్క్రీన్ సైజును రెండింతలు అయ్యేలా చేస్తాయి. కానీ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్‌ను పూర్తిగా తెరిస్తే ఓ టాబ్లెట్ అంత సైజు ఉండే అవకాశం ఉంది.


ఇక ఈ ఫోన్ ధర కూడా రూ.3 లక్షలకు పైగానే ఉండొచ్చని అంటున్నారు. అంటే, ప్రీమియం ఐఫోన్ ధర కంటే ఖరీదైనదన్న మాట. దీంతో తొలి దశల్లో ఈ ఫోన్‌ల ఉత్పత్తి పరిమితంగానే ఉండొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. కానీ ఈ వార్తలపై శాంసంగ్ ఇప్పటివరకూ స్పందించలేదు.

ఇవి కూడా చదవండి

విండోస్ పీసీ నెమ్మదిస్తోందా.. ఈ ఒక్క యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే..

ఇంట్లో వైఫై రౌటర్ ఉందా.. అయితే ఈ తప్పులు మాత్రం చేయొద్దు

Read Latest and Technology News

Updated Date - May 25 , 2025 | 10:34 AM