Share News

Neeraj Chopra: పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌‌తో స్నేహంపై వివరణ ఇచ్చిన నీరజ్ చోప్రా

ABN , Publish Date - May 15 , 2025 | 09:27 PM

పాక్ క్రీడాకారుడు అర్హద్ నదీమ్ తనకేమీ క్లోజ్ ఫ్రెండ్ కాదని నీరజ్ చోప్రా అన్నాడు. పహల్గాం దాడి తరువాత తమ రిలేషన్‌లో కొంత మార్పు తప్పదని చెప్పాడు.

Neeraj Chopra: పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌‌తో స్నేహంపై వివరణ ఇచ్చిన నీరజ్ చోప్రా
Neeraj Chopra, Arshad Nadeem

ఇంటర్నెట్ డెస్క్: జావెలిన్ త్రో క్రీడలో ప్రస్తుతం టాప్ అథ్లెట్స్ నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్. పాక్‌కు చెందిన అర్షద్ నదీమ్‌కు భారత్‌లో జరగనున్న ఎన్‌సీ క్లాసిక్ టోర్నమెంట్‌లో పాల్గొనాలంటూ ఆహ్వానం పంపిన నీరజ్ చోప్రా విమర్శల పాలయ్యారు. పహల్గాం దాడి నేపథ్యంలో అతడిపై నెట్టింట విమర్శలు ఎక్కువయ్యాయి. ఇక ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో అర్షద్‌తో ఉన్న స్నేహంపై ఓ విలేకరి నీరజ్ చోప్రాను ప్రశ్నించారు.

‘‘మీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కదా. ప్రపంచాన్ని ఏకతాటిపైకి తేగల సామర్థ్యం క్రీడాకారులకు ఉందని మీరు నిరూపించారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో మీ బంధంపై ప్రభావం పడుతుందా? అని విలేకరి నీరజ్‌ చోప్రాను అడిగారు. దీనిపై నీరజ్ స్పందిస్తూ.. ‘‘అసలు మేమిద్దరం అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏమీ కాదు. మామూలుగా మాట్లాడుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా జావెలిన్ థ్రో క్రీడాకారుల్లో అనేక మంది నాకు ఫ్రెండ్సే. అయితే, ఎవరైనా మనల్ని గౌరవంగా పలకరించినప్పుడు మనం కూడా స్పందించాలి కదా. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో కొంత మార్పు తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఎవరైనా మర్యాద చూపించినట్టు నేను అదే రీతిలో ప్రతిస్పందిస్తాను’’ అని అన్నాడు.


హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా ప్యారిస్ ఒలింపిక్స్‌లో వెండి పతకం సాధించిన విషయం తెలిసిందే. అయితే, పహల్గాం దాడి నేపథ్యంలో తనను ట్రోల్ చేయడం బాధించిందని ఇటీవల నీరజ్ చెప్పుకొచ్చాడు. పహల్గాం దాడి కంటే ముందే తాను ఎన్‌సీలో పాల్గొనాలంటూ అర్హద్‌కు ఆహ్వానం పంపానని అప్పట్లో వివరించాడు. తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయడం బాధించిందని అన్నాడు.


ఇక రేపు జరగనున్న దోహా ఇంటర్నేషనల్‌లో నీరజ్ కూడా పాల్గొననున్నాడు. దేశ ప్రాదేశిక సైన్యంలో సుబేదార్‌ మేజర్‌గా పని చేస్తున్న స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాకు లెఫ్టినెంట్‌ కల్నల్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు భారత ఆర్మీ.. గెజిట్‌ను విడుదల చేసింది. శుక్రవారం నుంచి దోహాలో డైమండ్‌ లీగ్‌ ప్రారంభమవనున్న తరుణంలో ఈ ఉత్తర్వులు రావడం నీరజ్‌లో మరింత స్ఫూర్తి నింపనుంది. టోక్యో, పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడంతో పాటు క్రీడా రంగంలో నీరజ్‌ చోప్రా కనబరిచిన విశిష్ట ప్రతిభను గుర్తించి పదోన్నతి కల్పించినట్టు మిలటరీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి, మేజర్‌ జనరల్‌ జీఎస్‌ చౌధురి తెలిపారు.

ఇవీ చదవండి:

ఆర్సీబీకీ అదిరిపోయే న్యూస్

నీరజ్‌ ఇక లెఫ్టినెంట్‌ కల్నల్‌

ఏ ప్లస్‌ లోనే రోహిత్‌ విరాట్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 15 , 2025 | 09:41 PM