Share News

Final Test: బౌలర్లూ చెలరేగాలి

ABN , Publish Date - Aug 03 , 2025 | 06:16 AM

అత్యంత ఆసక్తిగా సాగుతున్న ఐదో టెస్టులో ఫలితం తేలడం ఖాయమైంది. ఈ ఆఖరి మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్‌కు బ్యాటర్లు అండగా నిలిచారు. ఫలితంగా టీమిండియా...

Final Test: బౌలర్లూ చెలరేగాలి

ఆకాశ్‌, జడేజా, సుందర్‌ హాఫ్‌ సెంచరీలు

ఇంగ్లండ్‌ లక్ష్యం 374

ప్రస్తుతం 50/1

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 396

జైస్వాల్‌ శతకం

లండన్‌: అత్యంత ఆసక్తిగా సాగుతున్న ఐదో టెస్టులో ఫలితం తేలడం ఖాయమైంది. ఈ ఆఖరి మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్‌కు బ్యాటర్లు అండగా నిలిచారు. ఫలితంగా టీమిండియా.. ప్రత్యర్థి ఇంగ్లండ్‌ ముందు 374 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (118) సెంచరీ, ఆకాశ్‌దీప్‌ (66), వాషింగ్టన్‌ సుందర్‌ (53), జడేజా (53)ల అర్ధసెంచరీలతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులు సాధించింది. పేసర్‌ టంగ్‌ ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ధ్రువ్‌ జురెల్‌ (34) ఫర్వాలేదనిపించాడు. ఇక ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ శనివారం ఆట చివరి ఓవర్‌లో ఓపెనర్‌ క్రాలే (14) వికెట్‌ను కోల్పోయి 50/1 స్కోరుతో నిలిచింది. ఓపెనర్‌ డకెట్‌ (34) క్రీజులో ఉన్నాడు. ఆటకు ఇంకా రెండు రోజుల సమయం ఉండగా.. ఇంగ్లండ్‌ గెలుపునకు మరో 324 పరుగుల దూరంలో ఉంది. ఈ స్థితిలో ఇరు జట్ల విజయావకాశాలపై ఉత్కంఠ నెలకొంది. మిగిలిన వికెట్లను భారత బౌలర్లు ఎంత వేగంగా తీస్తారనేది కీలకంగా మారనుంది. తొలి టెస్టులో కూడా ఇంగ్లండ్‌ ఆఖరి రోజు 350 రన్స్‌ బాది విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు ఓవల్‌లో అత్యధిక ఛేదన 263 పరుగులే కావడం గమనార్హం.


ఆకాశ్‌ అనూహ్యంగా..: ఓవర్‌నైట్‌ స్కోరు 75/2తో భారత్‌ మూడో రోజును మెరుగ్గా ఆరంభించింది. ముఖ్యంగా శుక్రవారం నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాశ్‌ అంచనాలకు మించిన ఆటతో అదరగొట్టాడు. దాదాపు సెషన్‌ మొత్తం క్రీజులో నిలిచి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడిని ఊరించేందుకు తొలి ఓవర్‌నే స్పిన్నర్‌ బెథెల్‌తో వేయించారు. కానీ మూడో బంతినే ఫోర్‌గా మలిచిన ఆకాశ్‌ దీటుగా బదులిచ్చాడు. పిచ్‌ ఫ్లాట్‌గా మారడంతో టంగ్‌, అట్కిన్సన్‌ ఓవర్లలోనూ అవలీలగా బౌండరీలు సాధిస్తూ అండగా నిలిచాడు. అటు జైస్వాల్‌ తన సహజశైలిలో ఆడి ఒత్తిడి పెంచాడు. ఇక ఆకాశ్‌ 21 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో క్రాలే వదిలేయగా.. ఈ చాన్స్‌ను వినియోగించుకుంటూ కెరీర్‌లో తొలి అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఎక్కువగా తనే స్ట్రయికింగ్‌ తీసుకోగా.. ఒవర్టన్‌, టంగ్‌ ఓవర్లలో వరుసగా రెండేసి ఫోర్లతో అదుర్స్‌ అనిపించాడు. చివరకు లంచ్‌కు ముందు ఒవర్టన్‌ షార్ట్‌ బాల్‌కు ఆకాశ్‌ షో ముగిసింది. అప్పటికే మూడో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం చేరింది.

జైస్వాల్‌ అదుర్స్‌: రెండో సెషన్‌లో జైస్వాల్‌ శతకంతో పాటు భారత్‌కు భారీ ఆధిక్యం దక్కింది. అయితే అటు ఇంగ్లండ్‌ పేసర్లు కూడా ప్రభావం చూపి మూడు వికెట్లు తీయగలిగారు. ఫీల్డింగ్‌లో మాత్రం మళ్లీ నిరాశపరుస్తూ జైస్వాల్‌, కరుణ్‌ క్యాచ్‌లను వదిలేశారు. సెషన్‌ తొలి బంతికే కెప్టెన్‌ గిల్‌ (11)ను అట్కిన్సన్‌ ఎల్బీ చేశాడు. ఇక 127 బంతుల్లో జైస్వాల్‌ కెరీర్‌లో ఆరో శతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు క్రీజులో ఇబ్బందిపడిన కరుణ్‌ (17)ను సైతం అట్కిన్సన్‌ పెవిలియన్‌కు చేర్చాడు. అయితే జడేజాతో కలిసి ఆరో వికెట్‌కు 44 పరుగులు జోడించిన జైస్వాల్‌.. టంగ్‌ షార్ట్‌ పిచ్‌ బాల్‌కు దొరికిపోయాడు. అనంతరం జురెల్‌ ఎదురుదాడికి దిగడంతో భారత్‌ స్కోరు ఈ సెషన్‌లోనే 300 దాటింది.


జడేజా-సుందర్‌ మరోసారి..: ఆఖరి సెషన్‌లో లోయర్‌ మిడిలార్డర్‌ నుంచి విలువైన పరుగులు జత చేరాయి. ఏడో వికెట్‌కు జడేజాతో కలిసి 50 పరుగులు జోడించాక జురెల్‌ వెనుదిరిగాడు. అనంతరం జడ్డూ ఈ సిరీ్‌సలో ఐదో హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే జడేజా, సిరాజ్‌ (0)లను టంగ్‌ ఒకే ఓవర్‌లో దెబ్బతీశాడు. అయితే చివర్లో సుందర్‌ చెలరేగి అట్కిన్సన్‌ ఓవర్‌లో 4,4,6తో 39 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. కానీ భారీ షాట్‌ ఆడే యత్నంలో టంగ్‌కు చిక్కడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 224;

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 247;

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) ఒవర్టన్‌ (బి) టంగ్‌ 118, రాహుల్‌ (సి) రూట్‌ (బి) టంగ్‌ 7, సుదర్శన్‌ (ఎల్బీ) అట్కిన్సన్‌ 11, ఆకాశ్‌దీప్‌ (సి) అట్కిన్సన్‌ (బి) ఒవర్టన్‌ 66, గిల్‌ (ఎల్బీ) అట్కిన్సన్‌ 11, నాయర్‌ (సి) స్మిత్‌ (బి) అట్కిన్సన్‌ 17, జడేజా (సి) బ్రూక్‌ (బి) టంగ్‌ 53, జురెల్‌ (ఎల్బీ) ఒవర్టన్‌ 34, సుందర్‌ (సి) క్రాలే (బి) టంగ్‌ 53, సిరాజ్‌ (ఎల్బీ) టంగ్‌ 0, ప్రసిద్ధ్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 26; మొత్తం: 88 ఓవర్లలో 396 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-46, 2-70, 3-177, 4-189, 5-229, 6-273, 7-323, 8-357, 9-357, 10-396; బౌలింగ్‌: అట్కిన్సన్‌ 27-3-127-3, టంగ్‌ 30-4-125-5, ఒవర్టన్‌ 22-2-98-2, బెథెల్‌ 4-0-13-0, రూట్‌ 5-1-15-0.

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలే (బి) సిరాజ్‌ 14, డకెట్‌ (బ్యాటింగ్‌) 34, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 13.5 ఓవర్లలో 50/1; వికెట్‌ పతనం: 1-50; బౌలింగ్‌: ఆకాశ్‌దీప్‌ 5-1-15-0, ప్రసిద్ధ్‌ 5-1-23-0, సిరాజ్‌ 3.5-0-11-1.

1

ఓ టెస్టు సిరీ్‌సలో ఎక్కువ శతకాలు (12) బాదిన జట్టుగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికాలతో కలిసి టాప్‌లో నిలిచిన భారత్‌.

1

ఇంగ్లండ్‌లో జరిగిన సిరీస్‌ల్లో 50+ స్కోర్లు ఎక్కువసార్లు (6) సాధించిన భారత బ్యాటర్‌గా జడేజా.

2

భారత్‌ తరఫున ఓ టెస్టు సిరీ్‌సలో ఎక్కువ పరుగులు (754) చేసిన రెండో భారత బ్యాటర్‌గా గిల్‌. గవాస్కర్‌ (1971లో 774) టాప్‌లో ఉన్నాడు. అలాగే ఈ ఫీట్‌ సాధించిన రెండో కెప్టెన్‌ కూడా గిల్‌. డాన్‌ బ్రాడ్‌మన్‌ (1936లో 810)ముందున్నాడు.

ఈ వార్తలు కూడా చదవండి...

అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిగ్‌బాస్‌ అరెస్ట్ ఖాయం

Read Latest AP News and National News

Updated Date - Aug 03 , 2025 | 06:17 AM