Share News

India Eyes Second T20 Victory: జోష్‌లో భారత్‌

ABN , Publish Date - Dec 11 , 2025 | 06:18 AM

టీ20 సిరీ్‌సను అదిరే విజయంతో ఆరంభించిన భారత్‌.. అదే జోరును కొనసాగించాలనుకొంటోంది. ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగే...

India Eyes Second T20 Victory: జోష్‌లో భారత్‌

రాత్రి 7గం. నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

రెండో టీ20 నేడు

  • హార్దిక్‌ ఫామ్‌తో హుషారు

  • ఒత్తిడిలో గిల్‌

  • సమంపై సఫారీల గురి

ముల్లన్‌పూర్‌ (న్యూ చండీగఢ్‌): టీ20 సిరీ్‌సను అదిరే విజయంతో ఆరంభించిన భారత్‌.. అదే జోరును కొనసాగించాలనుకొంటోంది. ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టీ20లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కటక్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టినా.. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ వైఫల్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గాయంతో వన్డే సిరీ్‌సకు దూరమైన అతడు తగిన విశ్రాంతి తర్వాత బరిలోకి దిగినా.. స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ముఖ్యంగా అభిషేక్‌ శర్మకు అతడు ఏమాత్రం సరితూగడం లేదు. గిల్‌ రాకతో సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు కష్టమవుతుండడం కూడా అతడిపై ఒత్తిడికి కారణమవుతోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన జితేష్‌ శర్మకు బదులుగా సంజూ శాంసన్‌ను తీసుకోవాలని సోషల్‌మీడియాలో చర్చ మొదలైంది. కీపర్‌ బెర్త్‌ కోసం వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఇక, కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్‌పై కూడా ఆందోళన నెలకొంది. పొట్టి వరల్డ్‌కప్‌ నేపథ్యంలో సూర్య తన మునుపటి విధ్వంసకర బ్యాటింగ్‌ కోసం ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. అయితే, గాయం నుంచి కోలుకొన్న హార్దిక్‌ పాండ్యా ఆడిన తొలి మ్యాచ్‌లోనే అజేయ అర్ధ శతకంతో అదరగొట్టాడు. అతడి నుంచి జట్టు ఇదే తరహా ఇన్నింగ్స్‌ను జట్టు ఆశిస్తోంది. అయితే, బ్యాటింగ్‌ డెప్త్‌ కావాలనుకొంటే అర్ష్‌దీప్‌ స్థానంలో హర్షిత్‌ రాణాను తీసుకొనే చాన్సులున్నాయి. ఒకవేళ పిచ్‌ పొడిగా ఉంటే మాత్రం జట్టులో ఎటువంటి మార్పులూ ఉండే అవకాశం లేదు. మరోవైపు దక్షిణాఫ్రికా బలంగా పుంజుకోవాలనుకొంటోంది. బ్రెవిస్‌ మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడం జట్టును కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కోసం సిపామ్లా స్థానంలో ఆల్‌రౌండర్‌ కోర్బిన్‌ బాష్‌కు చాన్స్‌ దక్కొచ్చు.


జట్లు (అంచనా)

భారత్‌: అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, సూర్య కుమార్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, జితేష్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌/రాణా, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా.

దక్షిణాఫ్రికా: డికాక్‌, మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), ట్రిస్టన్‌ స్టబ్స్‌, బ్రెవిస్‌, డేవిడ్‌ మిల్లర్‌, డోనోవాన్‌ ఫెరీరా, యాన్సెన్‌, సిపామ్లా/బాష్‌, కేశవ్‌, ఎన్‌గిడి, నోకియా.

పిచ్‌/వాతావరణం

ఈ స్టేడియంలో ఇదే తొలి పురుషుల అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌. గత సెప్టెంబరులో రెండు మహిళల వన్డేలు జరిగాయి. పేసర్లకు పిచ్‌ నుంచి సహకారం అందే చాన్సులున్నాయి. ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో వికెట్‌ బ్యాటింగ్‌కు అంతగా అనుకూలంగా కనిపించలేదు. తొలుత బ్యాటింగ్‌ తీసుకొని 200 పైగా స్కోరు చేస్తే గెలుపు ఖాయమే. మంచు ప్రభావం అంతగా ఉండకపోవచ్చు.

ఈ మ్యాచ్‌ సందర్భంగా పంజాబ్‌ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పేరిట ఏర్పాటు చేసిన స్టాండ్‌ల ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది.

ఇవీ చదవండి:

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. నెం.2గా కోహ్లీ

నా ఇన్‌స్టాలో బుమ్రా కనిపించాలంటే..!.. అర్ష్‌దీప్ సింగ్ వ్యాఖ్యలు వైరల్

Updated Date - Dec 11 , 2025 | 06:18 AM