NRI: వైభవంగా స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6వ వార్షికోత్సవం
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:07 PM
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవ వేడుకల ఘనంగా జరిగాయి. ఎన్నారైలు ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారు 2025 ఏప్రిల్ 26 శనివారం నాడు 6వ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగపూర్లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని అన్నారు. లలిత కళలను ఈ విధంగా ప్రోత్సహించడం ఆనందదాయకమని చెప్పారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయని ప్రశంసించారు. ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను మెచ్చుకున్నారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యమని చెప్పారు. కాబట్టి, కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.
ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్, శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు) అసోసియేషన్ అనిత రెడ్డి, కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు, మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H & H శ్యామల, విష్ణు ప్రియ, సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ శ్రీ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష, అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్ గారు, KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్లర్ను సన్మానించారు.
స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారనిన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేశారు. నేటికీ ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.
పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్లర్ బహుమతి ప్రదానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు. ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించి త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచ రత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియలకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగంపై వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి చైతన్య వ్యవహరించారు. పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేష స్పందనలను తెలియజేశారు.
ఇవి కూడా చదవండి:
బహ్రెయిన్లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు
జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్