Share News

SATA Central: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మృతులకు సాటా సెంట్రల్ కొవ్వొత్తులతో నివాళి

ABN , Publish Date - Jun 15 , 2025 | 03:51 PM

ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి సౌదీలో సాటా సెంట్రల్ సంఘం నివాళులు అర్పించింది.

SATA Central: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మృతులకు సాటా సెంట్రల్ కొవ్వొత్తులతో నివాళి
Air India crash tribute

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘోరకలి దుర్ఘటన నుండి విదేశాలలోని ప్రవాసీయులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. విదేశాలలో అందునా ప్రత్యేకించి గల్ఫ్ దేశాలలో ఉన్న వారికి తమ జాతీయ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాపై మమకారం కాస్త ఎక్కువ. ఈ కారణాన ఎయిర్ ఇండియా దుర్ఘటన నుండి ఇప్పటికీ అనేక మంది ప్రవాసీయులు తేరుకోలేకపోతుండగా మరికొందరు అసువులు బాసిన తోటి ప్రవాసీయులకు నివాళులు అర్పిస్తున్నారు.


ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా సెంట్రల్ శనివారం రియాధ్ నగరంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించింది. బ్రిటన్‌లో ఒక నూతన జీవన అధ్యాయానికి శ్రీకారం చుట్టే ప్రయత్నంలో కొన్ని కుటుంబాలకు తమ ప్రప్రథమ విమాన ప్రయాణమే అంతిమ ప్రయాణం కావడం దిగ్ర్భాంతి కలిగిస్తోందని సాటా సెంట్రల్ మహిళా నాయకురాలు అక్షిత ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రమాదంలో మరణించిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ మరో మహిళా నాయకురాలు గడ్డం శిల్ప.. గల్ఫ్‌లో పని చేసి మరింత అభివృధ్ధి కోసం బ్రిటన్‌కు వెళ్ళిన మలయాళీ నర్సు రంజీత మరణం బాధాకరమని అన్నారు.


విదేశాలలో ఉంటూ జల్సాగా జీవించడమే కాకుండా, కష్ట కాలంలో మాతృభూమికి తోడుగా ఉండే విధంగా ప్రవాసీయులకు వారి గురుతర బాధ్యతను తెలియజేసే ఉద్దేశ్యంలో భాగంగా తాము కొవ్వొత్తులతో నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా సాటా సెంట్రల్ అధ్యక్షుడు జి.ఆనందరాజు వెల్లడించారు. కష్టకాలంలో అండగా ఉండటాన్ని సాటా సెంట్రల్ బలీయంగా విశ్వసిస్తుందని దాని ప్రతినిధులు ఎర్రన్న, యూఖుబ్ అలీ ఖాన్‌లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అమెరికాలో ఫారిన్ స్టూడెంట్స్‌కు అత్యధికంగా జాబ్స్ ఇచ్చిన కంపెనీలు ఇవే

హెచ్-1బీ వీసా వివాదం.. అమెరికా కంపెనీపై జరిమానా

Read Latest NRI News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 04:04 PM