Canada: కెనడాలో భారత యువతి దుర్మరణం.. మృతదేహం తరలింపులో సాయపడాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి
ABN , Publish Date - Apr 19 , 2025 | 09:21 PM
కెనడాలో మృతి చెందిన తమ కూతురి మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంలో సహకరించాలని బాధిత కుటుంబం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బస్ స్టాప్లో నిలబడ్డ యువతికి ప్రమాదవశాత్తూ తూటా తగలడంతో మృతి చెందిన విషయం తెలిసిందే.

కెనడాలో ప్రమాదవశాత్తూ తుపాకీ తూటా తగిలి మృతి చెందిన యువతి మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంలో సాయపడాలంటూ బాధిత తల్లిదండ్రులు పంజాబ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కెనడాలో చదువుకుంటున్న 21 ఏళ్ల యువతి హర్సిమ్రట్ కౌర్ రణ్ధావాకు ఇటీవల ప్రమాదవశాత్తూ తుపాకీ తూటాకు బలైంది. పని కోసం బయలుదేరిన ఆమె బస్ స్టాప్ వద్ద వేచి చూస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది.
గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలోని తుపాకీ పేల్చడంతో ఓ తూటా పొరపాటున వచ్చి యువతి ఛాతిలోకి దూసుకుపోవడంతో ఆమె మరణించింది. హర్సిమ్రట్ ఒంటారియోలోని మోహాక్ కాలేజీలో చదువుకుంటోంది. కాగా యువతి మృతిపై టొరొంటోలోని భారతీయ కాన్సులేట్ జనరల్ శుక్రవారం సంతాపం వ్యక్తం చేశారు. కాల్పుల సమయంలో అక్కడే ఉన్న ఆమెకు ప్రమాదవశాత్తూ తూటా తగిలి మరణించిందని పోలీసులు చెప్పినట్టు వెల్లడించారు. బాధిత కుటుంబంతో తాము టచ్లో ఉన్నామని, వారి మనశ్శాంతి కోసం ప్రార్థిస్తామని తెలిపారు.
ఘటనపై హామిల్టన్ పోలీసులు కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. కాల్పుల విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలిపారు. అక్కడ యువతి ఛాతికి తూటా గాయంతో అచేతనంగా కనిపించింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని అన్నారు. ఈ ఉదంతం తాలూకు సీసీటీవీ లేదా డ్యాష్ క్యామ్ ఫుటేజీ ఉన్న వారు ముందుకు రావాలని కూడా విజ్ఞప్తి చేశారు. యువతి మృతి నేపథ్యంలో ఎన్నారైల భద్రతకు సంబంధించి మరోసారి నెట్టింట చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్
డల్లాస్ ఈద్ మిలాప్ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి డా.పెమ్మసాని