Australia: ఆస్ట్రేలియాలో దారుణం.. అరెస్టు సమయంలో తీవ్ర గాయాలు.. కోమాలో భారత సంతతి వ్యక్తి
ABN , Publish Date - Jun 03 , 2025 | 09:56 AM
ఆస్ట్రేలియా పోలీసుల బలప్రయోగం వికటించింది. అరెస్టు సమయంలో ఓ భారత సంతతి వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యి కోమాలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ భారత సంతతి వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో పోలీసుల బలప్రయోగం వికటించి బాధితుడి కోమాలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం అతడిని లైఫ్ సపోర్టుపై ఉంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. అడిలైడ్లో ఈ ఘటన జరిగింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, గౌరవ్ కుండీ, తన భాగస్వామి అమృత్పాల్ కౌర్తో వీధిలో గురువారం గొడవపడుతుండగా ఈ ఘటన జరిగింది. అటుగా వెళుతున్న పెట్రోలింగ్ పోలీసులు వారి మధ్య గొడవను చూసి గృహహింసగా భావించారు. గౌరవ్ హింసాత్మక చర్యలకు దిగలేదని, మద్యం మత్తులో కేవలం గట్టిగా అరిచాడని అమృత్కౌర్ తెలిపారు. అయితే, అరెస్టు సమయంలో అతడు తీవ్రంగా ప్రతిఘటించాడని పోలీసులు తెలిపారు. చివరకు స్పృహ కోల్పోయిన కింద పడిపోయాడని అన్నారు. మరోవైపు, అమృత్పాల్ కౌర్ ఈ ఘటనాక్రమాన్ని వీడియోలో కూడా రికార్డు చేసినట్టు స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
పలువురు పోలీసులు గౌరవ్ను తమ కారుకు అదిమిపెట్టి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినట్టు వీడియోలో కనిపించింది. తానేమీ తప్పు చేయలేదని కూడా గౌరవ్ ఈ సందర్భంగా అరిచాడు. గౌరవ్ను విడిచి పెట్టాలని కౌర్ మరోవైపు కన్నీరుమున్నీరయ్యారు. అన్యాయంగా అతడిని అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ్ను నేలపై అదిమిపెట్టి ఉంచే సమయంలో అతడు స్పృహ కోల్పోయాడు. ఓ పోలీసు అధికారి అతడి మెడపై తన మోకాలితో అదిమిపెట్టి కదలకుండా చేసేందుకు ప్రయత్నించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘ఆ దృశ్యం చూసి కంగారు పడిపోయా. వీడియో రికార్డు చేయడం ఆపేశా’ అని కౌర్ తెలిపారు.
గౌరవ్ను వెంటనే రాయల్ అడెలెయిడ్ ఆసుపత్రికి తరలించారు. అతడి మెదడు, మెడకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. లైఫ్ సపోర్టుపై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. గౌరవ్ ఎప్పటికైనా కోమాలోంచి బయటపడతాడో లేదో తెలియదని కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సౌత్ ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ధరించిన కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారలను బట్టి చూస్తే.. పోలీసులు వ్యవహరించిన తీరు సబబేనని తాము నమ్ముతున్నట్టు యాక్టింగ్ అసిస్టెంట్ కమిషనర్ జాన్ డికాండియా పేర్కొన్నారు. అయితే, విచారణ మాత్రం కొనసాగుతోందని తెలిపారు. అమెరికాలో 2020 నాటి జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతాన్ని గుర్తుకు తెస్తున్నట్టు ఉన్న ఈ ఘటన పెను కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి:
బే ఏరియాలో ఘనంగా కృష్ణ 82వ జయంతి వేడుకలు
సౌదీలో వైభవంగా తెలుగు దేశం మినీ మహానాడు