Dubai: దుబాయిలో కన్నుమూసిన తెలంగాణ ప్రవాసీయుల మృతదేహాలు స్వదేశానికి రాక
ABN , Publish Date - Apr 19 , 2025 | 08:07 PM
దుబాయిలో జరిగిన పాకీస్తాని ఉన్మాది దాడిలో మృతి చెందిన తెలంగాణ వాసుల మృతదేహాలు శనివారం స్వదేశానికి చేరుకున్నాయి. ఈ తరలింపులో దుబాయిలోని ఎన్నారైలు తమ వంతు సహకారం అందించారు.

శవపేటికలపై పెద్దగా అక్షరాలతో సంఘాల పేర్లు రాసిన వైనం
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయిలో పాకిస్తానీ ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురయిన నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన అష్టపు ప్రేంసాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ల మృతదేహాలు శనివారం స్వదేశానికి చేరుకోన్నాయి. వారు మరణించిన వారం రోజుల తర్వాత పార్థిక దేహాలను స్వదేశానికి చేర్చగలిగారు. శుక్రవారం రాత్రి ఎయిర్ ఇండియా విమానం నుండి రావాల్సిన ఈ మృతదేహాల గుర్తింపు ప్రక్రియలో జాప్యం జరగడంతో తరలింపులో కొంత ఆలస్యం జరిగింది. దీంతో, అందుబాటులో ఉన్న తదుపరి విమానంలో శనివారం తెల్లవారు జామున దుబాయి నుండి బయలుదేరిన మృతదేహాలు హైదరాబాద్కు చేరుకోగా వాటిని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రవాసీ వ్యవహారాల అధ్యయన కమిటి చైర్మన్ డాక్టర్ జి. వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, కమిటి సభ్యులైన తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి, చెన్నమనేని శ్రీనివాస రావు, నంగి దేవేందర్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.
అంతకు ముందు, శుక్రవారం రాత్రి దుబాయిలోని శవాలను పేటికలలో భద్రపరిచే కార్యక్రమాన్ని ప్రవాసీ కార్యకర్తలయిన గుండెల్లి నర్సింహులు, యస్వీ రెడ్డి, దోనికేని కృష్ణ, కటుకం రవి, వంశీ గౌడ్లు పర్యవేక్షించారు. తమకు వీలైన విధంగా తమ పరిధిలో వీరందరూ కూడా దుబాయిలో మృతుల కుటుంబాలకు అధికారిక లాంఛనాలు పూర్తి కావడంలో సహకరించారు.
తమ కృషి వల్ల మృతదేహాలు స్వదేశానికి వెళ్తున్నాయంటూ బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా చెప్పుకున్నట్టు సమాచారం. వీరు కాకుండా, శవ పేటికలపై గల్ఫ్ వర్కర్స్ ప్రొటక్షన్ కౌన్సిల్, గల్ఫ్ వర్కర్స్ అవేర్నేస్ సెంటర్ అంటూ పెద్ద అక్షరాలతో రాసుకున్నట్టు కూడా తెలిసింది.
కేసు విచారణ అనేది పోలీసుల పరధిలోని ఆంశం కాగా మృతదేహాల తరలింపుకు అవసరమైన విమాన టిక్కెట్ల ఖర్చును మృతుల కంపెనీ భరించగా విధాన ప్రక్రియ ప్రకారం భారతీయ కాన్సులేటు తరలింపుకు సంబంధించి యన్.ఓ.సిని జారీ చేసింది. ఓదార్పుతో పాటు మృతదేహాలను పంపే లాంఛనాలను పూర్తి చేయడంలో గుండెల్లి నర్సింహులు, యస్వీరెడ్డిలతో పాటు ఇతరులు తగు విధంగా సహాకరించారు.
ఇవి కూడా చదవండి:
జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్
డల్లాస్ ఈద్ మిలాప్ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి డా.పెమ్మసాని