TANA: తానా ఆధ్వర్యంలో వైభవంగా డా. సి.నారాయణరెడ్డి 94వ జయంతి
ABN , Publish Date - Aug 01 , 2025 | 09:10 AM
తానా పాఠశాల ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి 94వ జయంతి వేడుక వైభంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు సినారె రచనల విశిష్ఠతను ప్రశంసించారు.

తెలుగు సాహితీ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారని సినారెను కొనియాడిన వక్తలు
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి 94వ జయంతిని అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సిలో ఘనంగా నిర్వహించారు. తానా-పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భానుప్రకాష్ మాగులూరి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధులుగా.. ప్రముఖ రచయిత్రి దివాకర్ల రాజేశ్వరి, గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులుగా, అధికార భాషా సంఘ అధ్యక్షులుగా, సినీ గేయ రచయితగా అనేక బాధ్యతలు సినారె నిర్వహించారని అన్నారు. తెలుగు సాహిత్యంలో, మకుటం లేని మహారాజుగా వెలుగొందారని ప్రశంసించారు. తెలుగు కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించటమే కాక, అనేక నూతన ప్రక్రియలను ఆవిష్కరించి, తెలుగు సాహితీ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. మానవుడు ప్రకృతిపై ఆధిపత్యం సాధించాలనే తపన అనేక అనర్థాలకు కారణమయ్యిందని చెప్పారు.
మనిషి ప్రకృతిని లోబరచుకొని, వనరులను దోచుకొని ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించటం వలన ప్రస్తుతం సమాజం అనేక సమస్యల్ని ఎదుర్కొంటుందని వక్తలు అన్నారు. ప్రకృతితో మమేకమై సమతాస్థితిని సాధించటమే సినారె రచన విశ్వంభర ఇచ్చే అమూల్య సందేశమని అన్నారు. తెలుగు సాహితి రంగాన్ని సినారె సుసంపన్నం చేశారని చెప్పారు. అక్షర సేద్యంతో తెలుగు భాషలోని మాధుర్యాన్ని రుచి చూపించారని వ్యాఖ్యానించారు. వారి గజల్స్, కవితలు, పాటలు, పద్యాలు అన్నీ కూడా..పేదల బ్రతుకులను, వారి దుర్భర జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపించాయని అని వివరించారు.
ఈ కార్యక్రమంలో నక్షత్రం వేణు, పయ్యావుల చక్రవర్తి, చామర్తి శ్రావ్య, కొత్తూరి కామేశ్వరరావు, బోనాల రామకృష్ణ, పునుగువారి నాగిరెడ్డి, బండి సత్తిబాబు, దుగ్గి విజయ భాస్కర్, చల్లా సుబ్బారావు, చిట్టెపు సుబ్బారావు, చెరుకూరి ప్రసాద్, వనమా లక్ష్మి నారాయణ, మేకల సంతోష్ రెడ్డి, సామినేని వెంకటేశ్వరరావు పలువురు ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
యూఎస్ వీసా విధానంలో కీలక మార్పు.. సెప్టెంబర్ 2 నుంచి..
శక్తిమంతమైన భారతీయ పాస్పోర్టు.. ఇండియన్స్కు ఈ దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ