Share News

Healthy Fruit Dishes: పండ్లతో కొత్తగా కమ్మగా

ABN , Publish Date - May 31 , 2025 | 02:04 AM

అనాస పండు, మామిడి పండు మరియు కివి పండ్లతో తయారయ్యే అనేక రుచికరమైన వంటకాలు వివరించబడ్డాయి. ఈ వంటకాలు ఆరోగ్యానికి మేలు చేసేవి కావడం వల్ల మీ నిత్యజీవితంలో చేర్చుకోవడానికి సరైనవి.

Healthy Fruit Dishes: పండ్లతో కొత్తగా కమ్మగా

వంటిల్లు

మనం రోజూ రకరకాల పండ్లు తింటూ ఉంటాం.కొన్ని పుల్లగా, కొన్ని తియ్యగా వేటికవే విభిన్నంగా ఉంటాయి. వీటితో నోరూరించే వంటలు కూడా చేయవచ్చు.పండ్లను కొత్తగా, కమ్మగా ఆస్వాదించాలనుకునేవారి కోసం ఈ రుచులు...

అనాస పండు కూర

  • కావాల్సిన పదార్థాలు

అనాస పండు (పైన్‌ఆపిల్‌) ముక్కలు- ఒక కప్పు, కరివేపాకు తరుగు- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, కారం- ఒక చెంచా, పసుపు- పావు చెంచా, నూనె- మూడు చెంచాలు, ఆవాలు- పావు చెంచా, జీలకర్ర- పావు చెంచా, అల్లం తరుగు- అర చెంచా, వెల్లుల్లి తరుగు- అర చెంచా, పచ్చిమిర్చి ముక్కలు- ఒక చెంచా, కొబ్బరి పాలు- రెండు కప్పులు, బియ్యప్పిండి- ఒక చెంచా, నిమ్మరసం- రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు

  • తయారీ విధానం

  • ఒక వెడల్పాటి గిన్నెలో అనాస పండు ముక్కలు, ఒక చెంచా కరివేపాకు తరుగు, కొద్దిగా ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ గిన్నె మీద మూతపెట్టి రెండు నిమిషాలు నాననివ్వాలి. ఒక చిన్న గిన్నెలో బియ్యప్పిండి వేసి కొన్ని నీళ్లు పోస్తూ జారుగా కలపాలి.

  • స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి రెండు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. తరవాత ఆవాలు, జీలకర్ర, ఒక చెంచా కరివేపాకు తరుగు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, చిటికెడు పసుపు వేసి కలపాలి. ఇవి వేగాక కొబ్బరిపాలు పోసి కలపాలి. ఒక నిమిషం తరవాత బియ్యప్పిండి నీళ్లు పోస్తూ కలపాలి. తరవాత కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి రెండు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్‌ మీద నుంచి దించాలి.

  • స్టవ్‌ మీద మరో గిన్నె పెట్టి ఒక చెంచా నూనె వేసి వేడి చేయాలి. ఇందులో అనాస పండు ముక్కల మిశ్రమం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి ఒక నిమిషం వేగనివ్వాలి. తరవాత ఇందులో కొబ్బరి పాల మిశ్రమం పోసి కలిపి రెండు నిమిషాలు ఉడికాక స్టవ్‌ మీద నుంచి దించాలి. పైన కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి సర్వ్‌ చేసుకోవాలి. పుల్కా, చపాతీ, పూరీ, వేడి అన్నంలోకి ఈ కూర రుచిగా ఉంటుంది.

  • జాగ్రత్తలు

  1. కొబ్బరి పాలు చిక్కగా ఉండాలి. అనాస పండు ముక్కలను మరీ ఎక్కువగా వేపకూడదు.

  2. చివరలో కొద్దిగా జీడిపప్పు పేస్టు కలిపితే కూర మరింత రుచిగా ఉంటుంది.

  • అనాసలో బి, సి విటమిన్లు, కాపర్‌, మాంగనీస్‌, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌ లాంటి మినరల్స్‌ ఉంటాయి. ఇవి శరీరంలో కొల్లాజెన్‌ ఉత్పత్తికి, మెదడుతోపాటు నరాల పనితీరు మెరుగుపడేందుకు, జీవక్రియలకు, కణాల వృద్ధికి, తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చడానికి తోడ్పడతాయి. అనాసలోని పీచుపదార్థాలు రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయి పెరగకుండా నిరోధిస్తాయి. ఈ పండులో బ్రోమెలైన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

Untitled-2 copy.jpg


మామిడి పండు బొబ్బట్లు

  • కావాల్సిన పదార్థాలు

పెద్ద సైజు మామిడి పండు- ఒకటి, మైదా- ఒక కప్పు, ఉప్పు- చిటికెడు, వేడి నీళ్లు- అర కప్పు, పచ్చి కొబ్బరి తురుం- అర కప్పు, నెయ్యి- నాలుగు చెంచాలు, పంచదార- అర కప్పు, యాలక్కాయ పొడి- అర చెంచా

  • తయారీ విధానం

  1. వెడల్పాటి గిన్నెలో మైదా, ఉప్పు వేసి వేడి నీళ్లు చల్లుకుంటూ మెత్తని ముద్దలా కలపాలి. దీని మీద మూతపెట్టి ఉంచాలి. మామిడి పండును నీళ్లతో శుభ్రంగా కడిగి తొక్క తీయాలి. చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ మామిడి గుజ్జును చిన్న గిన్నెలోకి తీసుకోవాలి.

  2. స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి వేడిచేయాలి. ఇందులో పచ్చి కొబ్బరి తురుం వేసి కలుపుతూ పచ్చి వాసన పోయే వరకూ వేయించాలి. అయిదు నిమిషాల తరవాత పంచదార, మామిడి గుజ్జు వేసి కలపాలి. ఈ మిశ్రమం దగ్గరకు వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. తరవాత యాలక్కాయ పొడి వేసి కలిపి స్టవ్‌ మీద నుంచి దించి చల్లార్చాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేయాలి.

  3. మైదా పిండి ముద్దను అయిదు నిమిషాలపాటు గట్టిగా ఒత్తుతూ కలపాలి. తరవాత చిన్న ముద్దలుగా చేయాలి. చపాతీ పీటమీద కొద్దిగా పొడి పిండి చల్లి దానిమీద పిండి ముద్ద పెట్టి మందపాటి చపాతీలా ఒత్తాలి. ఈ చపాతీ మధ్యలో మామిడి-కొబ్బరి ఉండ పెట్టి అన్ని వైపుల నుంచి మూసి ముద్దలా చేయాలి. దీనిని చపాతీ పీట మీద పెట్టి మెల్లగా ఒత్తుతూ పలుచని చపాతీ మాదిరి చేయాలి.

  4. స్టవ్‌ మీద పెనం పెట్టి వేడిచేసి కొద్దిగా నెయ్యి రాయాలి. దీని మీద చపాతీ వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చాలి. ఇవి బాగా పొంగి మెత్తగా రుచిగా ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న మామిడి బొబ్బట్లు మూడు రోజుల వరకూ నిల్వ ఉంటాయి. అదే ఫ్రిజ్‌లో పెడితే వారం పాటు బాగుంటాయి.

  • జాగ్రత్తలు

  1. మైదా పిండికి బదులు గోధుమ పిండి వాడుకోవచ్చు.

  2. పంచదారకు బదులు బెల్లం వేసుకోవచ్చు.

  3. నెయ్యి వద్దనుకుంటే వెన్న లేదా నూనెతో కూడా చేసుకోవచ్చు.

  • మామిడి పండులో ఎ, సి విటమిన్లతోపాటు పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మామిడి పండును తినడం వల్ల శరీరంలో క్యాన్సర్‌ కారకాలు నశిస్తాయి. తక్షణ శక్తి లభిస్తుంది. గుండె, చర్మం, కళ్లు, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Untitled-2 copy.jpg


కివి పచ్చడి

  • కావాల్సిన పదార్థాలు

కివి పండ్లు- మూడు, కొత్తిమీర తరుగు- రెండు కప్పులు, పుదీనా తరుగు- రెండు కప్పులు, పచ్చిమిర్చి ముక్కలు- మూడు చెంచాలు, అల్లం తరుగు- ఒక చెంచా, నల్ల ఉప్పు- పావు చెంచా, ఉప్పు- అర చెంచా, జీలకర్ర పొడి- అర చెంచా, పంచదార- ఒక చెంచా, నీళ్లు- మూడు చెంచాలు, పసుపు- చిటికెడు, నూనె- రెండు చెంచాలు, ఆవాలు- పావు చెంచా, ఎండు మిర్చి- ఒకటి ఇంగువ- చిటికెడు, కరివేపాకు- రెండు రెమ్మలు.

  • తయారీ విధానం

కివి పండ్లను కడిగి తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. మిక్సీలో కివి ముక్కలు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం తరుగు, నల్ల ఉప్పు, ఉప్పు, జీలకర్ర పొడి, పంచదార, నీళ్లు, పసుపు వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. తరవాత గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్‌ మీద చిన్న గిన్నె పెట్టి నూనె వేసి వేడిచేయాలి. ఇందులో ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ, కరివేపాకు వేసి బాగా వేపి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఈ తాలింపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి బాగా కలపాలి. ఈ కివి పచ్చడిని బ్రెడ్‌తో తింటే బాగుంటుంది. పుల్కా, చపాతీ, దోశ, వడలతో కూడా తినవచ్చు.

జాగ్రత్తలు

  1. కివి మరీ పచ్చివి లేదా పండువి కాకుండా మధ్యస్థంగా ఉన్నవాటిని తీసుకోవాలి.

  2. గుప్పెడు వేయించిన పల్లీలు లేదా రెండు చెంచాల జీడిపప్పు కూడా వేసి గ్రైండ్‌ చేస్తే పచ్చడి కమ్మగా ఉంటుంది.

  3. పచ్చడి పుల్లగా కావాలనుకుంటే రెండు రెమ్మల చింతపండు వేసుకోవచ్చు.

  • కివి పండును పోషకాల గనిగా చెబుతారు. దీనిలో సి, ఇ, కె విటమిన్లతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. తరచూ కివి పండును తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ముఖంమీద మొటిమలు, గుల్లలు రావు. చర్మం మృదువుగా ప్రకాశవంతంగా మారుతుంది. గుండె జబ్బులు రావు.

Untitled-2 copy.jpg

Updated Date - May 31 , 2025 | 02:09 AM