నాతో నేనే పోటీపడతా
ABN , Publish Date - Jun 08 , 2025 | 06:12 AM
తెలంగాణ జానపద గీతాలకు ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. పెద్ద హీరోలు కూడా ఫోక్ సాంగ్స్ అంటే ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ యాస, భాషలో పాటలు రాయడంలో ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్న పేరు కాసర్ల శ్యామ్...

తెలంగాణ జానపద గీతాలకు ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. పెద్ద హీరోలు కూడా ఫోక్ సాంగ్స్ అంటే ఆసక్తి చూపిస్తున్నారు. తెలంగాణ యాస, భాషలో పాటలు రాయడంలో ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్న పేరు కాసర్ల శ్యామ్. ఇప్పటివరకూ 800కి పైగా పాటలు రాసిన శ్యామ్తో ‘నవ్య’ ముచ్చట్లు.
మీ పాటల ప్రయాణం ఎలా మొదలైంది?
మాది హన్మకొండ ప్రాంతం. నాన్న కాసర్ల మధుసూదనరావు రంగస్థల, సినీ నటులు. ‘తల్లిదీవెన’, ‘చలిచీమలు’, ‘మంచికి స్థానం లేదు’ వంటి దాదాపు 30 చిత్రాల్లో ఆయన నటించారు. నటుడు కావాలనే కోరిక నాకు కూడా చిన్నతనంలో ఉండేది. అయితే నటుడిగా నిలదొక్కుకోవాలంటే ప్రతిభతో పాటు గాడ్ఫాదర్ కూడా ఉండాలి. అలా కాకుండా క్రియేటివ్ సైడ్ వెళితే బాగుంటుందనిపించింది. నాన్న కూడా నాకు అదే మాట చెప్పారు. సుభాన్ అని పెద్ద వంశీ దగ్గర కో డైరెక్టర్గా చేసేవారు. ఆయన మా నాన్న స్నేహితుడు. ఆయన ద్వారా దర్శకత్వ శాఖలో చేరితే బాగుంటుందని కూడా అనుకొనేవాణ్ణి. కృష్ణవంశీగారు ‘సిందూరం’ తీస్తున్నప్పుడు ఆయనవద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలని, అవకాశం కల్పించమని చంద్రబోస్ గారిని అడిగాను. కుదరలేదు. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి జానపదంలో ఎంఏ, ఎంఫిల్ చేశా. అప్పుడప్పుడు ప్రైవేట్ సాంగ్స్ రాసిన అనుభవం ఉండడంతో సినిమారంగంలో మిత్రులవల్ల అవకాశాలు వచ్చాయి.
కెరీర్పరంగా కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయా?
హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏడేళ్ల వరకూ సినిమా గురించి ఆలోచించలేదు. చదువు మీద దృష్టి పెట్టా. తర్వాత కొంత కాలం ఆకాశవాణిలో క్యాజువల్ అనౌన్సర్గా పని చేశా. అడపాదడపా కొన్ని సినిమా పాటలు రాశాను కానీ గీత రచయితగా కెరీర్ ప్రారంభించాలని సీరియ్సగా అనుకోలేదు. అయితే ‘మహాత్మా’ చిత్రంలో నా చేత ‘నీలపురి గాజులు’ పాటను కృష్ణవంశీగారు రాయించడం, అది పాపులర్ కావడంతో రచయితగా ప్రయత్నాలు ముమ్మరం చేశాను.
ఆ పాట మిమ్మల్ని రచయితగా నిలబెట్టిందా?
నిజం చెప్పాలంటే అంత హిట్ పాట రాసినా ఏడాది వరకూ నాకు అవకాశాలు లేవంటే నమ్మండి. ఆ పాట రాసింది నేనే అన్న విషయం చాలా మందికి తెలిసేది కాదు. అయినా ఒక మంచి పాట రాశాను అనే ధైర్యంతో పరిశ్రమలో అందరినీ కలిసేవాణ్ణి. ఆ క్రమంలో మారుతిగారు పరిచయమయ్యారు. ఆయన అప్పటికి పరిశ్రమలోకి రాలేదు. యాడ్స్ చేస్తుండేవారు. వాటికి నేను పాటలు రాసేవాణ్ణి. ఒకసారి మాటల మధ్యలో ‘నాకు నీలపురి గాజులు పాట అంటే ఇష్టం. అలాంటి పాటలు కావాలి’ అన్నారు. ఆ పాట రాసింది నేనే అని చెప్పగానే ఆశ్చర్యపోయారు. అప్పుడు తను తీస్తున్న ‘ఈరోజుల్లో’ చిత్రంలో నాతో పాటలు రాయించారు. వరుసగా 15 సినిమాల్లో నాతో పాటలు రాయించి ప్రోత్సహించారు. అప్పటి నుంచి నా ఎదుగుదల మొదలైంది.
తెలంగాణ యాసలో పాట రాయాలంటే ఇప్పుడు మీ పేరే చెబుతారు. అది మీకు ప్లస్సా, మైనస్సా?
‘నీ మీద ఒక ముద్ర పడకుండా చూసుకో..’ అని తోటి రచయితలు, సీనియర్స్ మొదట్లో సలహా ఇచ్చారు. అన్ని పాటలూ రాయగల సత్తా నీకు ఉంది కనుక జానపద రచయితగా ముద్ర పడకుండా చూసుకో అని కూడా చెప్పారు. ఏదో లేదు అని ప్రయత్నాలు చేసే బదులు నా కంటూ ఒక ముద్ర వేసుకుని, ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు రకరకాల జానర్స్లో పాటలు రాస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ముద్ర పడినా పర్వాలేదు అనే మొండి నమ్మకంతో ముందడుగు వేశాను.
మీ కెరీర్లో బాగా కష్టపెట్టిన పాట ఏమన్నా ఉందా?
ఆ సినిమాలు ఆడలేదు, పాటలకు అంత గుర్తింపు లేదు కానీ నన్ను నేను కష్టపెట్టుకున్న పాటలు రెండు ఉన్నాయి. శ్రీహరిగారి చివరి చిత్రం ‘రియల్ స్టార్’ వాటిల్లో ఒకటి. దానికి అంతకుముందు ‘ఛాయ్ సమోసా బిస్కెట్’ అనే టైటిల్ ఉండేది. అందులో ఇరానీ ఛాయ్ గురించి, హోటల్ గురించి ఓ పాట రాశాను. ఇకపై ఇరానీ ఛాయ్ గురించి ఎవరైనా పాట రాయాలంటే నా పాటను రిఫరెన్స్గా తీసుకోక తప్పదనే కసితో ఆ పాట రాశాను. అలాగే ‘పేపర్ బాయ్’ చిత్రంలో. ఇంతవరకూ ఏ రచయిత టచ్ చేయని పేపర్ బాయ్ లైఫ్ గురించి పాట రాశాను. ఇవి రెండూ నన్ను నేను బాగా కష్టపెట్టుకుని, రీసెర్చ్ చేసి రాసిన పాటలు. నాకు ఇష్టమైన పాటలు కూడా.
గీత రచయితల్లో మిమ్మల్ని విరాట్ కోహ్లితో పోలుస్తుంటారట. నిజమేనా?
(నవ్వు) ‘భీష్మ’ సమయంలో దర్శకుడు వెంకీ కుడుముల చివరి క్షణాల్లో పాట రాసి ఇవ్వాల్సిందే అని చెప్పారు. ముందు పల్లవి ఇస్తే దాన్ని షూట్ చేసుకుంటాం. తర్వాత చరణాలు ఇవ్వవచ్చు అన్నారు. ‘ఇంత హడావుడి పెడితే పాట బాగా రాయలేను సార్.. అన్నా. ‘మిమ్మల్ని ఎంత హడావుడి చేస్తే అంత బాగా రాస్తారు. మీరు విరాట్ కోహ్లీలాంటి వారు’ అని ఆయన అన్నారు. అవునా అని నాలో నేనే మురిసిపోయి ఆ పాట రాశా. నిజంగానే ఆ పాట బాగా వచ్చింది. వెంకీ గారు నాకు ఇచ్చిన ముద్దు పేరు అది.
గీత రచయితల్లో మీరు అభిమానించేది ఎవరిని?
పాత తరం రచయితల్లో చాలా వైవిధ్యంగా కనిపించే ఆరుద్ర నాకు చాలా ఇష్టం. రచయిత అంటే ఇలాగే ఉండాలా అనిపించే ఆయన గెటప్ నన్ను ఆకర్షించింది. ఆ తర్వాత నేను అభిమానించే రచయిత చంద్రబో్సగారు. మా వరంగల్ జిల్లా నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, చిన్న వయసులోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న గీత రచయిత ఆయన. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి సామాన్యులకు ఎలా చేరువ అయ్యారో, అలాగే సినిమా పాటను సామాన్యుల దగ్గరకు తీసుకువెళ్లిన రచయిత చంద్రబోస్. ఆయన పాటలు వింటుంటే పాట రాయడం ఇంత ఈజీనా అనిపించేది. కానీ రాయడం ఎంత కష్టమో నేను రచయితనయ్యాక తెలిసింది.
మీకు పోటీ ఎవరు?
కొత్తగా ఎలా ఆవిష్కరించుకోవాలా అని నాతో నేనే పోటీ పడుతుంటాను. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రాసిన పాటలు నా శైలికి చాలా దగ్గరగా ఉంటాయి. అవి వింటుంటే ‘అరే ఇవి కదా నేను రాయాల్సినవి’ అనుకుంటుంటాను. అందుకే ఆయన పాటల్ని పోటీగా తీసుకునేవాణ్ణి. మా గీత రచయితలందరి మధ్య మంచి స్నేహ సంబంధం ఉంది. నాకు ఏమన్నా సందేహం వస్తే చంద్రబో్సకు ఫోన్ చేసి అడుగుతుంటాను. సీతారామశాస్త్రిగారి చివరి రోజుల్లో ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగేవాణ్ణి. ‘రాములో రాముల’ పాట విని ఆయన నన్ను ఎంతో అభినందించారు. ‘ఇది నిజంగా శ్యామనామ సంవత్సరం రా’ అని దీవించారు.
జీవితంలో మీరు మరచిపోలేని సంఘటన?
సీతారామశాస్త్రిగారితో నాది రుణానుబంధం అనుకుంటాను. ‘పక్కా కమర్షియల్’ సినిమాలో టైటిల్ సాంగ్ మొదట నాతో రాయించారు. అది ఓకే అయినా కూడా శాస్త్రిగారి పాట ఉంటే బాగుంటుందని నేను రాసిన పాట పక్కన పెట్టి ఆయనతో రాయించారు దర్శకనిర్మాతలు. పాట మిస్ అయిందే అనే భావన కలిగినా నా బదులు గురువుగారే కదా రాసింది అని సరిపెట్టుకున్నాను. ఆయన చివరి రోజుల్లో ‘భీమ్లా నాయక్’లో గురువుగారు రాయాల్సిన పాట నేను రాయాల్సి వచ్చింది. ఆయన రుణం ఉంచుకోలేదు. తీర్చుకుని వెళ్లిపోయారు అనుకున్నా. ఇది నా జీవితంలో మరచిపోలేని సంఘటన.
హీరోల పరంగా మీకు వచ్చిన ప్రశంసలు ఏమిటి?
‘రాజా ది గ్రేట్’లో ‘ఎన్నియలో ఎన్నియలో’ పాట రాశాను. అది విని రవితేజ నన్ను అభినందించారు. ‘రాములో రాముల’ను అల్లు అర్జున్ గారు మెచ్చుకున్నారు. కల్యాణ్రామ్గారికి నేను రాసిన ‘బంబాట్’పాట చాలా ఇష్టం. ‘నా జీవిత కాలంలో సరిపోయే హిట్స్ అన్నీ ‘దసరా’లో ఇచ్చాడు’.. అని నాని అన్న అభినందించారు. నిర్మాతల్లో స్రవంతి రవికిశోర్గారు, హారిక హాసిని చినబాబు గారు.. నాకు రెగ్యులర్గా ఫోన్ చేసి నా పాటలను అభినందింస్తుంటారు.
వినాయకరావు
మీ ఫ్యామిలీ గురించి చెప్పండి
నా భార్య పేరు రాధిక. తను ఆర్కిటెక్ట్. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయి అమెరికాలో ఎం.ఎస్. చేస్తున్నాడు. చిన్నబ్బాయి సెవెన్త్ క్లాస్. వాడు పాడతాడు. నాన్నగారి నట వారసత్వం వచ్చింది.. భోళా శంకర్, ఫ్యామిలీ స్టార్, డాకూ మహారాజ్ తదితర చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు ‘ప్యారడైజ్’లో చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..