11A Seat: 27 ఏళ్ల క్రితం ఎయిర్ ఇండియా తరహా ప్రమాదం.. ప్రాణాలు దక్కించుకున్న 11ఏ సీటు ప్యాసెంజర్
ABN , Publish Date - Jun 14 , 2025 | 04:27 PM
ఇటీవలి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 11ఏ సీటులోని ప్రయాణికుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. 27 ఏళ్ల నాటి విమానం ప్రమాదంలో కూడా 11ఏ నెంబర్ సీటులో ప్రయాణికుడు సురక్షితంగా బయటపడటం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కూలిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే విమానంలోని బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్న ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేశ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, 27 ఏళ్ల క్రితం సరిగ్గా ఇలాంటి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన థాయ్లాండ్ పౌరుడు తాజా ఘటన గురించి తెలిసి షాకైపోయారు. అతడి సీటు కూడా 11ఏ కావడంతో ఈ ఉదంతం ప్రస్తుతం మిస్టరీగా మారింది.
1998 డిసెంబర్ 11న దక్షిణ థాయ్లాండ్లో ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా ఇంజెన్ ఆగిపోవడంతో విమానం అక్కడి చిత్తడి నేలల్లో ల్యాండవ్వాల్సి వచ్చింది. ప్రమాద సమయంలో విమానంలో 146 మంది ఉన్నారు. వీరిలో 101 మంది కన్నుమూశారు. ప్రాణాలతో బయటపడ్డ వారిలో రాంగ్సాక్ లోచుసాక్ కూడా ఒకరు. అతడి సీటు నెం. 11ఏ. విశ్వాస్ది కూడా తనలాగే 11ఏ సీటు అని తెలిసి రాంగ్సాక్ ఆశ్చర్యపోయారు. ‘తనూ నాలాగే 11ఏ సీటులో ప్రయాణించాడు’ అంటూ ఫేస్బుక్లో పోస్టు పెట్టారు.
అప్పటి బోర్డింగ్ పాస్ తన వద్ద లేకపోయినప్పటికీ తన సీటు గురించి అప్పటి వార్తల్లో స్పష్టంగా రాసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాక కూడా తనను ఏదో తెలియని అపరాధ భావం చాలా కాలం పాటు వెంటాడిందని అన్నారు. ప్రమాదం తరువాత దాదాపు 10 ఏళ్ల పాటు తాను విమాన ప్రయాణం చేయలేదని తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడ్డాక పునర్జన్మ లభించినట్టు భావించానని తెలిపారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితులకు కూడా సంతాపం తెలిపారు.
ఇక విశ్వాస్ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. విమానంలో అంతా మృతి చెందినా తన ప్రాణాలు ఎలా నిలిచాయో తెలియట్లేదని అన్నారు. ‘నా ప్రాణాలు కూడా పోతాయని కొద్ది సేపు అనిపించింది. ఆ తరువాత కాసేపటికి కళ్లు తెరిచి చూశా. బతికే ఉన్నానని అర్థమైంది. సీటు బెల్టు తీసి ఎలాగొలా బయటపడ్డా’ అని అన్నారు.
ఈ నేపథ్యంలో 11ఏ సీటు ఉదంతం మిస్టరీగా మారింది. ఈ రెండు ప్రమాదాల్లోనూ 11ఏ సీటులోని ప్యాసెంజర్లు క్షేమంగా బయటపడటం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారింది.
ఇవి కూడా చదవండి..
15 ఏళ్ల తర్వాత కలిశారు.. విమానం విషాదం మిగిల్చింది..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి